దారుణం: వ్యాధి నయం చేస్తానని యువతిపై రేప్
జులై 2న జరిగిన ఈ ఘటన జులై 30న బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో వెలుగులోకి వచ్చింది. నిందితుడిపై మధేపురాలోని అన్ని మహిళా పోలీస్స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. వివరాల్లోకి వెళితే.. జులై 1న బాధిత యువతి అనారోగ్యం పాలైంది. అప్పటికే గ్రామంలో తాంత్రికుడిగా పేరున్న బాధితురాలి తల్లి సోదరి భర్త మహేంద్ర మెహతా(35) వద్దకు ఆ యువతిని తీసుకెళ్లింది బాధితురాలి తల్లి.
ఆ యువతికి ఎవరో మంత్రాలు చేశారని చెప్పిన మహేంద్ర ఆమెను తన వద్దే ఉంచాలని చెప్పి వారిని పంపించేశాడు. ఎవరూ లేని గదిలోకి తీసుకెళ్లిన మహేంద్ర.. ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆమె అడ్డుకోవడంతో ఆమెపై (జులై 1న) అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడు బాధితురాలి కుటుంబానికి బంధువు కావడంతో అతడ్ని ఎవరూ అనుమానించలేదు. బాధితురాలు కూడా అప్పుడు ఎవరితో చెప్పలేదు.
ఆ తర్వాత బాధిత యువతి ఇంటికి వచ్చిన మహేంద్ర, మరోసారి తన ఇంటికి రావాలని ఆమెను కోరాడు. జులై 2న రాత్రి ఆ యువతి ఓ పదునైన కత్తి, సెల్ఫోన్ పట్టుకుని అతని ఇంటికి వెళ్లింది. అతడు మాట్లాడిన మాటలను ఆమె రికార్డు చేసింది. ఆ తర్వాత మళ్లీ అత్యాచారం చేసేందుకు యత్నించడంతో ఆమె అక్కడ్నుంచి తప్పించుకుని పారిపోయింది. అనంతరం ఆమె కుటుంబసభ్యులతో కలిసి పోలీసులను ఆశ్రయించింది. కాగా, పోలీసులు బాధితురాలి ఫిర్యాదు కేసు నమోదు చేసుకుని, పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.