మహిళా మేజిస్ట్రేట్పై వరకట్న వేధింపుల కేసు
పనాజి: ఓ మహిళా ట్రయల్ కోర్టు మేజిస్ట్రేట్, ఆమె కుటుంబ సభ్యులపై వరకట్న వేధింపుల కేసు నమోదైంది. ఈ మేరకు వివరాలను పోలీసులు బుధవారం తెలిపారు. ఈ ఘటన గోవా రాష్ట్రంలో చోటు చేసుకుంది.
వరకట్న వేధింపులు, భౌతిక, మానసికంగా చిత్రహింసలకు గురి చేస్తున్నట్లు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫస్ట్ క్లాస్ జుడిషియల్ మేజిస్ట్రేట్ ద్విజ్పాల్ పాట్కర్, ఆమె సోదరుడు ద్విజ్ పాట్కర్, తల్లి జయాపాట్కర్ లపై కేసు నమోదైంది. బాధిత మహిళకు మేజిస్ట్రేట్ అయిన ద్విజ్పాల్ పాట్కర్ సోదరుడు ద్విజ్ పాట్కర్తో వివాహం జరిగింది.
గత ఆరేళ్ల నుంచి వరకట్న వేధింపులకు గురిచేస్తోందని, తన తండ్రి దగ్గర్నుంచి రూ. 25 లక్షల వరకట్నంగా తీసుకురావాలని మానసికంగా హింసిస్తోందని బాధితురాలు మేజిస్ట్రేట్ ద్విజ్పాల్ పాట్కర్పై బాధితురాలు ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు నిందితులపై మార్గోవా పోలీసులు కేసు నమోదు చేశారు.
విద్యుత్ తీగ తగిలి ఐదుగురికి తీవ్రగాయాలు
కాన్పూర్: హైటెన్షన్ విద్యుత్ తీగ తగలడంతో ఐదుగురు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నొ జిల్లాలో మంగళవారం చోటు చేసుకుంది. మొహర్రం పండుగను పురస్కరించుకుని ‘టాజియా(పీర్ల పండగ)' ఊరేగింపు జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
ఊరేగింపులో పొల్గొన్న చిన్నారులు పీర్ల జెండాను పట్టుకుని వెళుతుండగా గంగా రైల్వే క్రాసింగ్ బ్రిడ్జ్ సమీపంలో లోహపు స్తంభానికి ఆ జెండా చిక్కుకుంది. అదే స్తంభానికి ఉన్న హైటెన్షన్ విద్యుత్ తీగకు జెండా తగలడంతో విద్యుత్ ప్రసరించి విద్యుత్ఘాతంతో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. శరీరం బాగా కాలిపోవడంతో వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.