Ranya Rao: రన్యా రావు సన్నిహితుడు అరెస్టు..గోల్డ్ స్మగ్లింగ్ కేసులో బిగ్టర్న్..!!
Ranya Rao: బంగారు అక్రమ రవాణా కేసులో ప్రధాన నిందితురాలు నటి రన్యా రావు ప్రత్యేక కోర్టులో హాజరైనపుడు కన్నీటి పర్యంతమయ్యారు. ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టులో న్యాయమూర్తి విశ్వనాథ్ సి. గౌడర్ ఎదుట డీఆర్ఐ అధికారుల పర్యవేక్షణలో కోర్టుకు వచ్చిన రన్యాను చూసేందుకు కోర్టు హాలు కిక్కిరిసిపోయింది.డీఆర్ఐ కస్టడీలో మూడు రోజుల పాటు ఉన్న సమయంలో, శారీరకంగా లేదా మానసికంగా ఏమైనా వేధింపులకు గురయ్యారా అని న్యాయమూర్తి ప్రశ్నించినప్పుడు కోర్టు హాలులో నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. ప్రశాంతంగా కనిపించిన రన్యా ఒక్కసారిగా దుఃఖాన్ని ఆపుకోలేక బోరున విలపించారు.
డీఆర్ఐ అధికారులు తనను మాటలతో బెదిరించారని తీవ్ర మానసిక క్షోభకు గురిచేశారని రన్యా రావు వాపోయింది.అధికారులు తనను శారీరకంగా ఏమీ చేయకపోయినా,విచారణ సమయంలో మాత్రం చాలా తీవ్రంగా మాటలతో బెదిరించారని న్యాయమూర్తి ఎదుట రన్యా వెల్లడించింది. తాము చెప్పినట్టు వినకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని భయపెట్టినట్లు రన్యా కోర్టుకు విన్నవించుకుంది.

అయితే, డీఆర్ఐ అధికారి వెంటనే స్పందించి, రన్యా విచారణను వేధింపులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని వాదించారు.విచారణలో ప్రతి క్షణం వీడియో రికార్డింగ్ చేయబడిందని చెప్పిన డీఆర్ఐ అధికారి.. ఆమె తరచూ విదేశాలకు వెళ్తున్న విషయం నిజమే అని చెప్పారు. దాని ఆధారంగానే తాము ప్రశ్నలు వేసినట్లు జడ్జికి తెలిపారు. కానీ ఆమె విచారణకు సహకరించడం లేదని ప్రయాణ చరిత్ర వంటి పత్రాలు చూపిస్తున్నప్పటికీ, ఆమె సహకరించడానికి నిరాకరిస్తున్నారనే విషయాన్ని న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు డీఆర్ఐ అధికారి.
దీనిపై రన్యా వెంటనే స్పందిస్తూ, తాను విచారణ సంస్థకు పూర్తిగా సహకరిస్తున్నానని అన్నారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి గౌడర్, రన్యాతో మాట్లాడుతూ, న్యాయస్థానం ఇరుపక్షాల వాదనలు వింటుందని,ఒకవైపు వాదనలు మాత్రమే విని కోర్టు ఎప్పుడూ ఒక నిర్ణయానికి రాదని గుర్తుచేశారు.విచారణకు సంబంధించిన వీడియో రికార్డింగ్లను క్షుణ్ణంగా పరిశీలిస్తామని జస్టిస్ విశ్వనాథ్ గౌడర్ తెలిపారు. ఒకవేళ బలవంతంగా లేదా బెదిరించి వాంగ్మూలాలు తీసుకున్నట్టు ఏమైనా ఆధారాలు లభిస్తే, కోర్టు తప్పకుండా చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.
మరోవైపు, డీఆర్ఐ వర్గాల సమాచారం ప్రకారం రన్యా, బంగారు కడ్డీలు ఎక్కడి నుండి సేకరించారు, ఏ సిండికేట్తో కలిసి పనిచేస్తున్నారు,ఆమెకు సహాయం చేస్తున్న పలుకుబడి కలిగిన వ్యక్తులు ఎవరు అనే కీలకమైన ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పడానికి నిరాకరిస్తున్నారని తెలిపారు.ఇదిలా ఉంటే కేసులో మరో కీలక అప్డేట్ వచ్చింది. ప్రముఖ హోటల్ అట్రియా ఓనర్ మనవడైన తరుణ్ రాజును డీఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
బంగారు స్మగ్లింగ్ ఆపరేషన్లో తరుణ్ రాజ్ హస్తం ఉందని అధికారులు అనుమానించిన నేపథ్యంలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఒకప్పుడు తరుణ్ రాజ్ రన్యా రావులు చాలా సన్నిహితంగా మెలిగారని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ఇద్దరూ కలిసి విదేశాల నుంచి గోల్డ్ స్మగ్లింగ్ చేశారని తెలిపారు. అయితే రన్యా రావు జతిన్ హుక్కెరీ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న తర్వాత వీరిద్దరి మధ్య స్నేహం బలహీనపడిందని అధికారులు పేర్కొన్నారు.అయితే దుబాయ్ నుంచి బంగారాన్ని రవాణా చేసే సమయంలో తరుణ్ రాజ్తో రన్యా కాంటాక్ట్లోకి వచ్చినట్లు అధికారులు గుర్తించారు.ఇదే తరుణ్ రాజ్ అరెస్టులో కీలకమైంది.












Click it and Unblock the Notifications