జిగేల్ జిగేల్: తవ్వకాల్లో గుట్టలుగా బయటపడ్డ బంగారం
తమిళనాడులోని మదురైకి సమీపంలో ఉన్న కీలడి ప్రాంతంలో పురావస్తు శాఖ జరిపిన తవ్వకాల్లో బంగారు బయటపడింది. తొలి మూడువిడతల్లో జరిగిన తవ్వకాల్లో పురాతన వస్తువులు బయటపడ్డాయి. రెండో విడత తవ్వకాల తర్వాత భారత పురావస్తు శాఖ కాకుండా రాష్ట్ర పురావస్తు శాఖ తవ్వకాలు చేపట్టాలని పలు తమిళ సంఘాలు డిమాండ్ చేశాయి. భారత పురావస్తు శాఖ తవ్వకాలు చేపడితే తమిళ చరిత్ర గురించి బయట ప్రపంచానికి చెప్పవని తమిళ సంఘాలు ఆరోపించాయి. దీంతో రాష్ట్ర పురావస్తు శాఖతో కలిసి భారత పురావస్తు శాఖ తవ్వకాలు జరిపింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూ.55 లక్షలు కూడా విడుదల చేసింది.
చంద్రన్ అనే వ్యక్తికి సంబంధించి 1.5 ఎకరాల్లో తవ్వకాలు జరపగా పలు వస్తువులు వెలుగుచూసినట్లు అధికారులు వెల్లడించారు. ఇంకా ఏమైనా వస్తువులు బయటపడే అవకాశం ఉండటంతో కార్తీక్ అనే మరో వ్యక్తి భూమిలో తవ్వకాలు జరపగా అందులో గుట్టలు గుట్టలుగా బంగారం బయటపడటంతో అధికారులు విస్మయానికి గురయ్యారు. బంగారంతో పాటు ఆకాలం నాటి ఇటుకలతో చేసిన పొయ్యిలు, నవరత్నాలతో పొదిగిన ఆభరణాలు బయటపడ్డాయి. దొరికిన బంగారాన్ని పరీక్షించేందుకు వేరే గ్రామానికి తరలించారు.
సెప్టెంబర్ వరకు తవ్వకాలు జరిపితే మరింత బంగారంతో పాటు మరిన్ని పురాతన వస్తువులు బయటపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అయితే ప్రస్తుతం అక్కడ కురుస్తున్న భారీ వర్షాలు తవ్వకాలకు అడ్డంకిగా మారాయి.