అందుకే భారత్పై పగబట్టా, ఉగ్రవాదినయ్యా: హెడ్లీ
ముంబై: భారతదేశం అంటే తనకు చిన్నప్పటి నుంచీ ద్వేషమేనని పాకిస్థాన్ అమెరికన్ ఉగ్రవాది డేవిడ్ కోల్మన్ హెడ్లీ చెప్పాడు. తాను చదువుకుంటున్న బడిని భారతదేశానికి చెందిన విమానాలు కూల్చేశాయని, అప్పటి నుంచి భారతదేశంపై పగబట్టానని పేర్కొన్నాడు.
ప్రతీకారం తీర్చుకోవడానికే లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థలో చేరానన్నాడు. ముంబై దాడుల కేసులో అమెరికాలో 35 ఏళ్ళ శిక్ష అనుభవిస్తున్న హెడ్లీ ముంబై కోర్టుకు శుక్రవారం సాక్ష్యం ఇచ్చాడు. 2008 నవంబరు 26న జరిగిన ఈ దాడుల్లో 166 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
భారతదేశానికి సాధ్యమైనంత ఎక్కువ నష్టం కలిగించాలన్నదే తన లక్ష్యమని హెడ్లీ చెప్పాడు. 1971 డిసెంబర్ 7న పాకిస్థాన్లో తాను చదువుతున్న పాఠశాల భవనంపై భారతీయ విమానాలు దాడి చేశాయని, ఆ భవనం ధ్వంసమైందని, అందులో ఉన్నవారంతా మరణించారని తెలిపాడు. 1971 డిసెంబరు 3 నుంచి 16 వరకు భారతదేశం, పాకిస్థాన్ మధ్య యుద్ధం జరిగింది. హెడ్లీ వయసు అప్పట్లో సుమారు 11ఏళ్ళు ఉండవచ్చు.
తమ కుటుంబానికి పాకిస్థాన్ ప్రభుత్వ పెద్దలతో సత్సంబంధాలు ఉన్నట్లు తెలిపాడు. తన తండ్రి మరణించినపుడు, అప్పటి ప్రధాని గిలానీ హాజరయ్యారని పేర్కొన్నాడు. హెడ్లీ తండ్రి పాకిస్థాన్కు చెందినవాడు కాగా, ఆయన తల్లి అమెరికా జాతీయురాలు.
హెడ్లీ పదహారేళ్ళ వయసు వరకు పాకిస్థాన్లో చదువుకున్నాడు. అనంతరం అమెరికా వెళ్ళాడు. తాను 2002లో లష్కరే తొయిబాలో చేరినట్లు ముంబై కోర్టుకు తెలిపాడు. శివసేన వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత బాల్ థాక్రేను కూడా తాము అంతం చేయాలనుకున్నట్లు డేవిడ్ హెడ్లీ ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే.