పొలం పనుల్లో డ్రీమ్గర్ల్.. పబ్లిసిటీ స్టంట్పై జనం సీరియస్..
Recommended Video

ఓట్ల కోసం నేతలు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. ప్రచారం ప్రారంభించిన నాటి నుంచి ముగిసే వరకు వారు వేసే వేషాలకు లెక్కుండదు. ఓటర్ల మన్నన పొందేందుకు అభ్యర్థులు పడరాని పాట్లు పడతారు. చాయ్ అమ్మడం నుంచి పిల్లలకు స్నానాలు చేయించే వరకు ఎన్నో సిత్రాలు చూపిస్తారు. బాలీవుడ్ డ్రీమ్గర్ల్, బీజేపీ ఎంపీ హేమమాలిని కూడా ఇలాంటి ప్రయత్నమే చేశారు. అయితే ఆమె పబ్లిసిటీ స్టంట్ మాత్రం స్థానిక ఓటర్లకు ఆగ్రహం తెప్పించింది.

గోధుమ చేనులో డ్రీమ్గర్ల్
ఎన్నికల్లో విజయం కోసం వినూత్న ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమమాలిని. మధుర నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగిన హేమ.. మహిళా ఓటర్లే టార్గెట్గా ఆదివారం ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఇందుకోసం గోధుమ చేనును వేదికగా చేసుకున్నారు.

కొడవలి పట్టి, పంట కోసి
తొలిరోజు మధుర నియోజకవర్గంలోని గోవర్థన క్షేత్రలో ప్రచారానికి వెళ్లిన హేమ.. పొలం పనులుచేస్తున్న మహిళా రైతులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. గోధుమ చేలో పనిచేస్తున్న వారి దగ్గరకు వెళ్లి కాసేపు ముచ్చటించారు. ఆ తర్వాత కొడవలి చేతబట్టి చేను కోస్తూ ఫొటోలు దిగారు. వాటిని ట్విట్టర్ లో పోస్ట్ చేయడంతో కాసేపటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

హేమపై స్థానికుల ఆగ్రహం
ఇదిలా ఉంటే హేమమాలిని తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. పబ్లిసిటీ కోసం ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఆమెకు ప్రజా సమస్యలు వినేందుకు సమయం దొరకడంలేదని అంటున్నారు. తమ కష్టాలు చెప్పుకునేందుకు గెస్ట్హౌస్ దగ్గరకు వెళ్లి గంటల తరబడి నిరీక్షించినా.. హేమామాలిని బయటకు రాలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications