గవర్నర్కు అజిత్ పవార్ మద్దతు లేఖ: శరద్ పవార్ నమ్మిన బంటు పొరపాటు వల్లే ఇంత జరిగిందా?
ముంబై: మహారాష్ట్ర రాజకీయాలు క్షణ క్షణం మలుపులు తిరుగుతూనే ఉన్నాయి. తాజాగా, సీఎం దేవేంద్ర ఫడ్నవీస్తో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ భేటీ అయ్యారు. సోమవారం కోర్టు, నవంబర్ 30న బలనిరూపణ నేపథ్యంలో బీజేపీ నేతలు న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నారు. అయితే, శనివారం ఉదయం బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అందరికీ షాకిచ్చిన విషయం తెలిసిందే.
మహారాష్ట్ర మహాట్విస్ట్! ఎన్నికలకు ముందే బీజేపీ ప్లాన్-బీ సిద్ధం చేసిందా? అసలేం జరిగిందంటే.?
తెల్లవారుజామున షాకింగ్..
శనివారం తెల్లవారుజామున ఎన్సీపీ రెబల్ నేత అజిత్ పవార్ తమ మద్దతు బీజేపీకేనంటూ గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారికి లేఖ అందించడంతో ఆయన ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇచ్చారు. దీంతో సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన ఎత్తివేస్తున్నట్లు గవర్నర్ ప్రకటించారు.
ఆ లేఖనే అందించారా?
అక్టోబర్ 30న ఎన్సీపీ లేజిస్టేచర్ పార్టీ నేతగా అజిత్ పవార్ ఎన్నికయ్యారు. ఆయనకు మద్దతు తెలుపుతూ ఎన్సీపీ ఎమ్మెల్యేలంతా సంతకాలు చేశారు. ఆ లేఖనే ఆయన గవర్నర్కు సమర్పించారని బీజేపీ చెబుతోంది.
ఆ లేఖలో ఏముందో..?
ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాజ్ భవన్కు వెళ్లిన ఎమ్మెల్యేలను అప్పటి పరిస్థితి వివరించమని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తన మీడియా సమావేశంలో అడిగారు.అయితే, వారు కూడా అజిత్ పవార్ గవర్నర్కు అందించిన లేఖలో ఏముందో చెప్పలేకపోయారు. అయితే, రాజ్ భవన్కు రమ్మనడంతో వెళ్లామని, అంతకుమించి తమకు ఏమీ తెలియదని చెప్పారు. తామంతా శరద్ పవార్ వెంటే ఉంటామని స్పష్టం చేశారు. దీంతో అజిత్ పవార్ అందించిన లేఖలో ఏముందనేది రహస్యంగానే ఉంది.
ఎన్సీపీ కూడా..
ముంబై పార్టీ ఆఫీసులో అజిత్ పవార్ను లేజిస్టేచర్ పార్టీ నేతగా ఎన్నుకున్న సందర్భంలో ఎమ్మెల్యేలు సంతకం చేసిన లేఖనే గవర్నర్కు అందించివుంటారని కొందరు ఎన్సీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. శరద్ పవార్ నమ్మినబంటు శివాజీరావు గార్జే కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
నమ్మినబంటు పొరపాటు వల్లేనా..?
శరద్ పవార్ నమ్మినబంటు శివాజీరావు గార్జే ద్వారానే ఎన్సీపీ నేతలంతా సమాచారాన్ని పంచుకోవడం జరుగుతుంది. మాజీ సివిల్ సర్వెంట్ అయిన గార్జేను శరద్ పవార్ తన పార్టీలోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆయనను మహారాష్ట్ర ఎన్సీపీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. పవార్ పిలుపుతో గార్జే తన సేవల నుంచి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవడం గమనార్హం. గార్జే నుంచే అజిత్ పవార్ శుక్రవారం రాత్రి లేజిస్లేచర్ పార్టీ నేతగా ఎన్నుకున్న లేఖను తీసుకున్నట్లు తెలుస్తోందని పలువురు ఎన్సీపీ నేతలు చెబుతున్నారు. శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే తదుపరి ముఖ్యమంత్రి అని శరద్ పవార్ ప్రకటించడంతోనే గవర్నర్ వద్ద ఈ లేఖ సమర్పించాల్సి ఉంటుందేమోనని భావించిన గార్జే.. ఆ లేఖను శరద్ పవార్ సోదరుడి కుమారుడైన అజిత్ పవార్కు ఇచ్చినట్లు తెలుస్తోంది. శరద్ పవార్ తర్వాత పార్టీలో అజిత్ పవార్ కీలక నేత కావడంతో ఈ లేఖను ఇచ్చేటప్పుడు శరద్ పవార్ను గార్జే సంప్రదించలేదు. అయితే, శనివారం ఉదయం అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయడంతో అటు శరద్ పవార్ కు.. ఇటు గార్జేకు ఏం జరిగిందనే విషయం అర్థమైంది. ఒక వేల అజిత్ పవార్ తనను లేఖ అడిగిన సమయంలో గార్జే.. శరద్ పవార్ను సంప్రదించివుంటే పరిస్థితి మరోలా ఉండేదేమో.
మరో వార్త కూడా.. చివరకు గవర్నర్ వద్దకే జయంత్ పాటిల్..
అజిత్ పవార్ ఎన్సీపీ నేతగా తమ మద్దతు లేఖను గవర్నర్కు ఇవ్వలేదనే మరో వార్త కూడా ప్రచారంలో ఉంది. అసెంబ్లీలో అజిత్ పవార్ను లేజిస్లేచర్ పార్టీ నేతగా ఎన్నుకునేందుకు సంతకాలు చేసిన ఎమ్మెల్యేల జాబితానే అందించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అజిత్ పవార్ను ఎన్సీపీ నుంచి తొలగిస్తున్నట్లు పార్టీ ప్రకటించింది. ఎన్సీపీ లేజిస్లేచర్ పార్టీ నేతగా జయంత్ పాటిల్ను అజిత్ స్థానంలో నియమించింది. ఆదివారం గవర్నర్ను కలిసిన జయంత్ పాటిల్.. అజిత్ పవార్ స్థానంలో తాను నియామకం అయినట్లు లేఖను సమర్పించారు.