జయలలిత ఆస్తి ఎంతో తెలుసా, ఈ ఆస్తికి ఎవరికి దక్కునో
జయలలితకు 117.13 కోట్ల విలువైన ఆస్తులున్నాయని ఆమె ఆఫిడవిట్ ఇచ్చింది. ఆర్ కె నగర్ నియోజకవర్గం నుండి పోటీచేసే సందర్భంగా ఆమె ఈ ఆఫిడవిట్ ను దాఖలు చేశారు.
చెన్నై : సినీ నటిగానే కాకుండా తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రజల హృదయాల్లో చెరగని ముద్రవేసిన జయలలిత ఆస్థి ఎంతో తెలుసా, ఎన్నికల సమయంలో ఆమె సమర్పించిన అఫిడవిట్ లో తనకు ఉన్న ఆస్థుల వివరాలను ఆమె ప్రకటించింది.ఈ ఆస్తులు ఎవరికి చెందుతాయనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు.
ఇటీవల ఎన్నికల్లో ఆర్ కె నగర్ నియోజకవర్గం నుండి జయలలిత పోటీచేశారు. ఈ ఎన్నికల్లో ఆమె అఫిడవిట్ సమర్పించారు. తనకు ఉన్న ఆస్తుల వివరాలను ఆమె వెల్లడించారు. 2015 జూన్ నాటికి తనకు 117.13 కోట్ల రూపాయాల ఆస్తులు ఉన్నాయని ఆమె ప్రకటించింది.ఈ ఆస్తులు ఎవరికీ దక్కుతాయో ఇంకా స్పష్టత రాలేదు.
ఈ ఆస్తుల్లో పోయేస్ గార్డెన్ లో 24 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో 43.96 కోట్ల విలువైన జయలలిత నివాసగృహం ఉంది.ఈ గృహాన్ని జయలలిత తల్లి 1967 లో1.32 లక్షలకు కొనుగోలు చేశారు. తమిళనాడులోని కంచెపురంలో 3.43 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా జీడిమెట్లలో 14.50 ఎకరాలు, ఉంది.ఈ భూమిని ఆమె 1968 లో కొనుగోలు చేశారు. కంచెపురంలో చెయూర్ లో ఉన్న ప్రాపర్టీని 1981 లో కొనుగోలు చేశారు.
జయలలితకు నాలుగు వాణిజ్య భవనాలు ఉన్నాయి. దానిలో ఒకటి హైద్రాబాద్ లో ఉంది.ఈ భవనం శశికళ దత్తత తీసుకొన్న శశికళ అన్న కుమారుడు సుధాకర్ కు చెందుతున్నట్టు రిపోర్టులు చెబుతున్నాయి.జయకు రెండో టయోటా ప్రాడో ఎస్ యూ వీలు, టెంపో ట్రావెలర్, టెంపో ట్రావెలర్, మహీంద్రా జీప్ లున్నాయి.వీటితో పాటు 1980 మోడల్ అంబాసిడర్ కారు, మహీంద్రా బొలేరో, స్వరాజ్ మ్యాక్సి 1990 కాంటెస్సా కారు జయలలిత వద్ద ఉన్నాయి.వీటి విలువ 42 లక్షల25వేలు ఉంటుంది.
బంగారు ఆభరణాలు ఆమె వద్ద చాలానే ఉన్నాయి.21,280.30 గ్రాముల బరువున్న బంగారు ఆభరణాలు తన వద్ద ఉన్నాయని ఆమె తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రకటించారు. ఆస్తుల కేసులో ఈ బంగారు ఆభరణాలు కర్ణాటక ప్రభుత్వ ట్రెజరీల్లో ఉన్నాయి. ఈ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది.1,250 కిలోల వెండి కూడ ఆమె వద్ద ఉంది. దీని విలువ సుమారు 3 కోట్ల 12 లక్షల 50 వేలు ఉంటుంది.
పెట్టుబడులు, షేర్లు
ఆమె పేరున 41.63 కోట్ల చరాస్తులు, 72.09 కోట్ల స్థిరఆస్తులున్నాయి.అక్రమాస్తుల కేసులో ఆమె పేరున పలు కంపెనీల్లో ఉన్న షేర్లు, డిపాజిట్లు పోలీసులు సీజ్ చేశారు. 2004 స్పెషల్ సీసీ 208 ప్రకారం కోర్టు కస్టడీకి తీసుకొంది. శ్రీజయ పబ్లికేషన్స్, శశి ఎంటర్ ప్రైజెస్, కోదండ ఎస్టేట్, రాయల్ వ్యాలీ, ఫ్లోరిటెక్ ఎక్స్ ఫోర్ట్స్, గ్రీన్ టీ ఎస్టేట్ లలో ఆమెకు పెట్టుబడులు ఉన్నాయి.ఈ సంస్థల్లో ఆమె 27.44 కోట్లను పెట్టుబడులుగా పెట్టింది.2015 -16 సంవత్సరానికి గాను ట్యాక్స్ రిటర్న్ లను పూర్తి చేశారు. 2013 14 లో పన్ను చెల్లింపులన్నీ పూర్తి చేశారు.ఆమె చేతిలో 41 వేల రూపాయాలు, 2.04 కోట్ల ఆస్థులున్నాయని ఆమె వివరించారు.