కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ గురించే నా ఆందోళన: శరద్ పవార్
ముంబై: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పరిస్థితి గురించి తనకు ఆందోళనగా ఉందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార అన్నారు. బీజేపీలో ప్రధానమంత్రి పదవి కోసం నరేంద్ర మోడీకి ప్రత్యామ్నాయంగా గడ్కరీ పేరు తెరపైకి వస్తుండడమే ఇందుకు కారణమని ఆయన చెప్పారు.
ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి గడ్కరీ పార్టీ కార్యక్రమాల్లో మామూలుగా చేసిన వ్యాఖ్యలు మీడియాలో వేడి రాజేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శరద్ పవార్ స్పందించారు.

గడ్కరీ తనకు స్నేహితుడని, గతంలో తాము కలిసి పనిచేశామని, మోడీకి ప్రత్యామ్నాయంగా ఆయన పేరు తెరపైకి వచ్చిందని, అందుకే, తాను ఆయన గురించి ఆందోళన చెందుతున్నానని శరద్ పవార్ చెప్పారు. దీనిపై ఆయన మరింతగా మాట్లాడలేదు.
వచ్చే లోకసభ ఎన్నికల్లో మహారాష్ట్రలో కాంగ్రెస్తో కలిసి పోటీ చేయాలని ఎన్సీపీ భావిస్తోంది. సీట్ల పంపకాలపై ఇప్పటికే చర్చలు తుది దశకు చేరుకున్నాయి. తమ కూటమిలో రాజ్ థాకరేకు చెందిన మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్ఎస్)కు కూడా చోటు కల్పించే విషయంపై తాము ఎటువంటి చర్చలు జరపలేదని శరద్ పవార్ తెలిపారు. యువత నుంచి రాజ్ థాకరేకు మద్దతు ఉందన్నారు. అయితే, పొత్తు విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.












Click it and Unblock the Notifications