సిఎం పదవిపై ఆశ లేదు: మాట మార్చిన ఉద్ధవ్ థాకరే
ముంబై: తాను ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నట్లు వారం రోజుల క్రితం చెప్పిన శివ సేన అధినేత ఉద్ధవ్ థాకరే మంగళవారంనాడు మాట మార్చారు. తనకు ముఖ్యమంత్రి కావాలనే కోరిక లేదని ఆయన చెప్పారు.
తనను వర్కారీ సమాజానికి చెందిన ప్రజలు తన నివాసానికి వచ్చి తనను దీవించారని, వచ్చే ఎన్నికల్లో తమ పార్టీని బలపరుస్తామని చెప్పారని ఆయన అన్నారు తనపై వారు కురిపించిన ప్రేమ తనకు చాలునని, తాను మహారాష్ట్ర ముఖ్యమంత్రిని కావాలని కోరుకోవడం లేదని ఆయన అన్నారు. వర్కారీ వర్గానికి చెందిన ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.

"ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి కావాలని అనుకుంటారని, ప్రజలు కుర్చీ కోసం పోరాటం చేస్తారని అంటూ నేను ఎంత అదృష్టవంతుడినో చూడండి. నా తలపై నేను కిరీటాన్ని కోరుకోవడం లేదు. అయినా ప్రజలు తనను సిఎంగా చూడాలని అనుకుంటున్నారు. ఆ ప్రేమను నేను సంపాదించుకున్నాను" అని థాకరే అన్నారు.
ఈ నెల 13వ తేదీన ఓ టీవీ న్యూస్ చానెల్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఉద్ధవ్ థాకరే తాను ముఖ్యమంత్రిని కావాలని అనుకుంటున్నట్లు తొలిసారి బహిరంగంగా చెప్పారు. ఉద్ధవ్ థాకరేను ముఖ్యమంత్రిని చేయాలని శివసేన ఆరాటపడుతున్నప్పటికీ మిత్ర పక్షం బిజెపి అంత సుముఖంగా ఉన్నట్లు కనిపించడం లేదు. ఎన్నికల ఫలితాల తర్వాతనే ముఖ్యమంత్రి ఎవరవుతారనేది తేలుతుందని బిజెపి నాయకులు అంటున్నారు.












Click it and Unblock the Notifications