ఇసుక మాఫియాను హడలెత్తించిన ఐఎఎస్ ఆత్మహత్య: అనుమానాలు
బెంగళూరు: కర్నాటకలోని కోలార్ జిల్లాలో ఇసు మాఫియాను హడలెత్తించిన ఐఎఎస్ అధికారి డికె రవి(35) అనుమానాస్పద స్థితిలో మరణించారు. బెంగళూరులోని తన ఇంటి సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకుని ఆయన మృతి చెందినట్టు అధికారులు చెప్పారు. సోమవారం ఉదయమే రవి ఆఫీసు నుంచి ఇంటికివెళ్లారని ప్రాథమిక సాక్షాధారాలను బట్టి ఆయన మరణాన్ని ఆత్మహత్యగా పరిగణిస్తున్నామని పోలీసు కమిషనర్ ఎంఎన్ రెడ్డి తెలిపారు.
ప్రస్తుతం డికె రవి వాణిజ్యపన్నుల(ఎన్ఫోర్స్మెంట్) అదనపుకమిషనర్గా పనిచేస్తున్నారు. పోస్టుమార్టం జరిపితే తప్ప ఆయన మరణానికి దారితీసిన కారణాలను కచ్చితంగా చెప్పలేమని కమిషనర్ అన్నారు. అయితే రవి ఉరేసుకుని మరణించారని చెప్పడానికి అనేక అంశాలు కారణమవుతున్నాయని స్పష్టం చేశారు. మరణవాంగ్మూలం కూడా సంఘటనా స్థలంలో కనిపించలేదని అలాగే దీని వెనక మూడో వ్యక్తి హస్తం ఉందని భావించే పరిస్థితి లేదని తెలిపారు.

ఓ బట్టతోనే ఆయన ఉరి వేసుకున్నట్టుగా తెలుస్తోందన్నారు. ఇప్పటికే వైద్య, ఫోరెన్సిక్ బృందాలు సంఘటనా స్థలాన్ని సందర్శించి ప్రాథమిక దర్యాప్తును పూర్తిచేశాయన్నారు. రవి ఎప్పుడు మరణించిందీ, అలాగే ఈ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులను నిర్ధారించడంపై దర్యాప్తు అధికారులు దృష్టి సారించారని చెప్పారు. ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశామని, దీనికి రోహిణీ కటోషీ అనే సీనియర్ అధికారిణి సారధ్యం వహిస్తున్నారని వెల్లడించారు.
ప్రస్తుతం వాణిజ్యపన్నుల శాఖ అదనపు కమిషనర్గా పనిచేస్తున్న 2009 బ్యాచ్కు చెందిన రవి గతంలో కోలార్ జిల్లాలో ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేయడంతో అప్పట్లో వారినుంచి ఆయనకు పలు బెదిరింపులు వచ్చాయి. గత ఏడాది అక్టోబర్లో రవిని అక్కడి నుంచి బదిలీ చేయడంతో స్థానికులు ఆయనకు మద్దతుగా నిరసనలు చేపట్టారు.
రవి వ్యక్తిగత సహాయకుడిని, డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. రవి తన భార్యతో కలిసి వారాంతంలో అత్తారింటికి వెళ్లాడు. ఉదయం 11 గంటలకు తిరిగి వచ్చారు. రోజంతా రవికి ఆయన భార్య ఫోన్ చేస్తూనే ఉంది. అయితే, సమాధానం రాలేదు. అతని చివరి కాల్ వివరాలను, ఈమెయిల్స్ను పోలీసులు పరిశీలిస్తున్నారు. కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. దీంతో వారిని పోలీసులు ప్రశ్నించలేకపోయారు.












Click it and Unblock the Notifications