‘‘సీఎం తలపై రివార్డు ప్రకటిస్తాడా.. అతడి తలపై రెట్టింపు రివార్డు నేనిస్తా..’’
సీఎం మమతాబెనర్జీ తల నరికి తెచ్చిన వారికి రూ.11 లక్షల రివార్డు ఇస్తానంటూ బీజేవైఎం నాయకుడు యోగేశ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై సుల్తాన్ షాహీ మసీద్ ఇమామ్ రెహ్మన్ బర్కతీ మండిపడ్డారు.
కోల్ కతా: పశ్చిమబంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ యువజన నాయకుడికి ఘాటుగా బదులిచ్చాడు ఓ ముస్లిం మతగురువు. ''సీఎం తలపై రివార్డు ప్రకటిస్తాడా..'' అని ఆగ్రహానికి గురైన ఆయన ''అతడి తలపై అంతకు రెట్టింపు రివార్డు నేనిస్తా..'' అంటూ ప్రకటించాడు.
సీఎం మమతాబెనర్జీ తల నరికి తెచ్చిన వారికి రూ.11 లక్షల రివార్డు ఇస్తానంటూ భారతీయ జనతా యువమోర్చా నాయకుడు యోగేశ్ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. యోగేశ్ వ్యాఖ్యలపై కోల్ కతా టిప్పు సుల్తాన్ షాహీ మసీద్ ఇమామ్ రెహ్మన్ బర్కతీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
''మమతాబెనర్జీపై మాకెంతో గౌరవం ఉంది. ఆమెను నేను సోదరిగా భావిస్తాను. అలాంటి వ్యక్తిపై వ్యాఖ్యలు చేసిన ఆ నాయకుడి తల నరకి తెచ్చిన వారికి రూ.22 లక్షల రివార్డు ఇస్తా..'' అంటూ ఇమామ్ రెహ్మన్ బర్కతీ ప్రకటించారు.

అయితే.. రెహ్మన్ బర్కతీ ఇలాంటి ప్రకటనలు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ, ప్రముఖ రచయిత సల్మాన్ రష్డీపై ఆయన ఇలాగే రివార్డులు ప్రకటించారు.
పశ్చిమబంగాలోని బీర్భమ్ జిల్లాలో హనుమాన్ జయంతి సందర్భంగా జరిగిన ర్యాలీలో పోలీసులు, ప్రజల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన యోగేశ్.. సీఎం మమతాబెనర్జీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
''శ్రీరామనవమి, హనుమాన్ జయంతి రోజుల్లో కూడా పూజలు నిర్వహించుకునేందుకు ఆమె అనుమతి ఇవ్వడం లేదు. ఎదిరించి పూజలు చేసిన వారిని తీవ్రంగా కొడుతున్నారు. ఆమె ముస్లింలకు మద్దతుదారు. ఇఫ్తార్ విందులు చేస్తారు.. మమతాబెనర్జీ తల నరికి తెచ్చిన వారికి రూ.11 లక్షల బహుమతి ఇస్తాను..'' అని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications