చైనాతో చర్చలకు ముందే పైచేయి: కాస్సేపట్లో మూడో విడత భేటీ: భారత్ ప్రతిపాదనకు డ్రాగన్ ఓకే
న్యూఢిల్లీ: లఢక్ సరిహద్దుల్లో భారత్-చైనాలను వేరుచేసే వాస్తవాధీన రేఖ వెంబడి తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ వాతావరణం నేపథ్యంలో.. మూడోసారి ఈ రెండు దేశాల మధ్య చర్చలు ప్రారంభం కానున్నాయి. శాంతియుత వాతావరణాన్ని ఏర్పరచుకోవడానికి కట్టుబడి ఉన్నామంటూ పదేపదే చెబుతోన్న భారత్..ఆ దిశగా మరోసారి ముందడుగు వేసింది. చైనాతో చర్చలకు సమాయాత్తమౌతోంది. ఉదయం 10:30 గంటలకు ఈ భేటీ ఆరంభం కానుంది.
ఇన్స్టాలో గుంటూరు విద్యార్థిని న్యూడ్ వీడియోలు: ఛార్జిషీట్: భయం పుట్టించేలా: వాసిరెడ్డి పద్మ
ఇదివరకు ఈ నెల 6, 22వ తేదీల్లోనూ ఈ రెండు దేశాల మధ్య చర్చలు కొనసాగినప్పటికీ.. ఎలాంటి ఫలితాలూ రాలేదు. మూడోసారి భారత భూభాగంపై చర్చలు ఏర్పాటు కాబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. వాస్తవాధీన రేఖకు ఇవతల భారత భూభాగంపై గల ఛుసుల్ ప్రాంతంలోని బోర్డర్ ఆఫీసర్స్ మీటింగ్ పాయింట్ (బీఓఎంపీ)లో భారత ఆర్మీ, చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన లెప్టినెంట్ కమాండర్ స్థాయి అధికారులు ఈ సమావేశానికి సారథ్యాన్ని వహించనున్నారు.
ఇదివరకు నిర్వహించిన రెండు సమావేశాలు కూడా చైనా భూభాగంపై గల మోల్డో ప్రాంతంలో కొనసాగినవే. మూడోసారి తమ భూభాగంపై చర్చలు నిర్వహించాలంటూ భారత ఆర్మీ అధికారులు చేసిన ప్రతిపాదనలను చైనా సైన్యాధికారులు అంగీకరించారు. ఛుసుల్లోని బీఓఎంపీలో భేటీ కావడానికి అంగీకరించారు. భారత్ తరఫున లఢక్ రీజియన్ 14వ కార్ప్స్ కమాండర్ హర్వీందర్ సింగ్ పాల్గొనబోతున్నారు. ఇప్పటిదాకా సాగిన మూడు విడతల సమావేశానికీ ఆయనే నేతృత్వాన్ని వహించారు.
వాస్తవాధీన రేఖ సమీపంలోని గాల్వన్ వ్యాలీ ప్రాంతంలో భారత్-చైనా సైనికుల మధ్య చోటు చేసుకున్న ప్రాణాంతక దాడుల తరువాత ఈ రెండు దేశాల మధ్య చర్చలు పునఃప్రారంభం కాబోతుండటం ఇది రెండోసారి. ఘర్షణల అనంతరం ఈ నెల 22వ తేదీన సుమారు 12 గంటల పాటు ఏకబిగిన భారత్-చైనా మధ్య చర్చలు కొనసాగిన విషయం తెలిసిందే. సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో ఎలాంటి ఫలితాలు కూడా వెలువడలేదు. దీనితో మరో విడత చర్చలకు రెండు దేశాల సైన్యాధికారులు సన్నద్ధమయ్యారు.
Recommended Video
టిక్టాక్, యూసీ బ్రౌజర్, షేర్ ఇట్ వంటి చైనాకు చెందిన యాప్ల వినియోగాన్ని భారత్లో నిషేధించిన మరుసటి రోజే ఈ రెండు దేశాల మధ్య చర్చలు ప్రారంభం కాబోతుండటం ఆసక్తి కలిగిస్తోంది. యాప్ల నిషేధం ప్రభావం ఈ చర్చలపై పడకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. దేశ అంతర్గత అంశం కావడం వల్ల దీనిపై చైనా ఆర్మీ పెద్దగా అభ్యంతరం వ్యక్తం చేయదనే చెబుతున్నారు. మూడో విడత చర్చల ఫలితం ఎలా ఉంటుందనే అంశంపై ఉత్కంఠత నెలకొంది.