ఇక సువిధ వద్దు, ప్రయాణికులకు కేంద్రం స్పష్టీకరణ
కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఇప్పటికే విమానాల్లో మాస్క్ అవసరం లేదని పౌర విమానయాన సంస్థ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో సడలింపు చేశారు. అదే విదేశీ ప్రయాణికులు ఇకపై సువిధ పోర్టల్లో ఆన్ లైన్ ఫామ్ నింపాల్సిన అవసరం లేదు. దాని నుంచి కేంద్ర ప్రభుత్వం వెసులబాటు కల్పించింది
విదేశాల నుంచి దేశానికి వచ్చే ప్రయాణికులు ఎయిర్ సువిధ పోర్టల్లో ఇదివరకు ఆన్ లైన్ ఫాం నింపాల్సి వచ్చేది. అందులో ప్రయాణికులు కరోనా వ్యాక్సినేషన్ వివరాలు, ఎన్ని డోసులు తీసుకున్నారనే వివరాలు ఫాంలో పొందుపరిచాల్సి ఉంటుంది. తాజాగా ఆ నిబంధనను కేంద్రం సడలించింది. ఇకపై అంతర్జాతీయ ప్రయాణికులు ఎయిర్ సువిధ పోర్టల్ లో తమ వ్యాక్సినేషన్ వివరాలు అందజేయాల్సిన అవసరం లేదు. ఆంక్షలు తొలగిస్తున్నామని పేర్కొంది.
ఇవాళ అర్ధరాత్రి నుంచి నిర్ణయం అమల్లోకి వస్తుందని కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. కరోనా సంక్షోభం తగ్గుముఖం పట్టడం, ప్రపంచవ్యాప్తంగా, భారత్ లోనూ వ్యాక్సినేషన్ ముమ్మరంగా జరిగినందున అంతర్జాతీయ ప్రయాణికుల మార్గదర్శకాలు సవరించారు. కొత్త మార్గదర్శకాలు జారీ చేశామని కేంద్ర పౌర విమానయాన శాఖ నుంచి ఓ నోటీసులో పేర్కొంది. ఇకపై ఏ ప్రయాణికుడు కరోనా వ్యాక్సినేషన్ పై స్వీయ హామీ పత్రం ఇవ్వాల్సిన పనిలేదని కేంద్రం పేర్కొంది.