అమెరికాకు పోస్టల్ సర్వీసులు బంద్ చేసిన కేంద్రం
ఇష్టానుసారంగా విధిస్తోన్న టారిఫ్ లతో భారత్ సహా అన్ని దేశాలనూ బెంబేలెత్తిస్తోన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. రష్యాను బద్ధశత్రువుగా పరిగణిస్తోన్నారు. ఆ దేశంతో వ్యాపార, వాణిజ్య సంబంధాలు పెట్టుకున్న.. ప్రత్యేకించి- క్రూడాయిల్ కొనుగోలు చేస్తోన్న దేశాలన్నింటిపైనా విరుచుకుపడుతున్నారు. కొరడా ఝుళిపిస్తోన్నారు.
ఈ క్రమంలో భారత్ పై ఇప్పటికే ఎకాఎకిన 50 శాతం అదనపు టారిఫ్ లను విధించారు డొనాల్డ్ ట్రంప్. తొలుత- 25 శాతంతో సరిపెట్టుకున్నాడనుకున్నప్పటికీ- ఆ తరువాత తాజాగా మరో 25 శాతం అదనపు వడ్డింపులు వడ్డించారు. ఫలితంగా 50 శాతం టారిఫ్ భారం పడింది.. భారత్ పై.

ఇది ఇక్కడితో ఆగేలా కనిపించట్లేదు. రష్యా నుంచి క్రూడాయిల్ కొనుగోలు చేసే దేశాలపై మరో విడత టారిఫ్ పెంచడానికి, ఆంక్షలు విధించడానికి అవకాశాలు లేకపోలేదని డొనాల్డ్ ట్రంప్ తాజాగా హెచ్చరించారు. సెకెండరీ ఆంక్షలు మరింత కఠినంగా ఉంటాయనీ పేర్కొన్నారు.
ఈ పరిణామాల మధ్య కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. అమెరికాకు అన్ని రకాల పోస్టల్ సర్వీసులను నిలిపివేసింది. ఇది తాత్కాలికమే. ఇది ఈ నెల 25వ తేదీ నుంచి అమలులోకి రానుంది. అమెరికా విధించిన 50 శాతం టారిఫ్ అమలులోకి వచ్చేది ఈ నెల 29వ తేదీ నుంచే కావడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్ యాక్ట్ టారిఫ్ ఫ్రేమ్వర్క్ ప్రకారం వాటి విలువతో సంబంధం లేకుండా అంతర్జాతీయ పోస్టల్ వస్తువులన్నింటిపైనా అమెరికా కస్టమ్స్ సుంకాలు విధిస్తుంది. 100 డాలర్ల వరకు విలువైన బహుమతులపై మాత్రం టారిఫ్ మినహాయింపు కొనసాగుతుంది.
డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారం- అంతర్జాతీయ పోస్టల్ నెట్వర్క్ ద్వారా రవాణా చేసే క్యారియర్లు లేదా అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (CBP) ద్వారా ఆమోదం పొందిన థర్డ్ పార్టీ సంస్థలు.. పోస్టల్ సరుకులపై టారిఫ్ ను వసూలు చేసి, అక్కడి ప్రభుత్వానికి చెల్లించాలి.
ఈ నెల 15వ తేదీన సీబీపీ కొన్ని మార్గదర్శకాలను జారీ చేసినప్పటికీ- అధికారిక గుర్తింపు పొందిన థర్డ్ పార్టీలు, టారిఫ్ వసూళ్లు, చెల్లింపు విధానాలకు సంబంధించిన అంశాలు స్పష్టంగా లేవు. దీని ఫలితంగా- అమెరికాకు వెళ్లే ఎయిర్ క్యారియర్లు ఏవీ కూడా ఈ నెల 25వ తేదీ నుంచే పోస్టల్ పార్సిళ్లను స్వీకరించలేమని ప్రకటించాయి.
ఆయా కారణాల వల్ల.. పోస్టల్ శాఖ ఈ నెల 25వ తేదీ నుండి అమెరికాకు వెళ్లే అన్ని రకాల పోస్టల్ ఆర్టికల్స్ బుకింగ్ను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించింది. ఉత్తరాలు/డాక్యుమెంట్లు, 100 అమెరికన్ డాలర్ల వరకు విలువైన బహుమతులకు ఈ నిలిపివేత వర్తించదు. వీటికి మినహాయింపు ఉంది.
ఈ పరిస్థితుల వల్ల అమెరికాకు పంపలేని ఆర్టికల్స్ బుక్ చేసుకున్న వినియోగదారులు పోస్టల్ ఛార్జీలను వాపసు తీసుకోవచ్చని కేంద్రం వెల్లడించింది. వీలైనంత త్వరగా అమెరికాకు పూర్తి సేవలను పునరుద్ధరించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు హామీ ఇచ్చింది.












Click it and Unblock the Notifications