జమ్మూకాశ్మీర్ మున్సిపల్ ఎన్నికలు: 63.83శాతం ఓటింగ్
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లో బుధవారం జరిగిన మొదటి దఫా స్థానిక సంస్థల ఎన్నికలు కొన్ని చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగానే జరిగాయి. కాశ్మీర్లోని వివిధ పార్టీలు ఎన్నికలను బహిష్కరించిన దృష్ట్యా మొత్తమ్మీద చూస్తే పోలింగ్ శాతం గణనీయంగా తగ్గింది.
కేవలం 8.3 శాతమే నమోదైంది. అయితే టెర్రరిస్టుల ఇలాకాగా పేరున్న కార్గిల్ లో 78 శాతం, లేహ్ లో 52 శాతం నమోదైంది. ఇక సాయంత్రం 4 గంటల సమయానికి బుడ్గామ్ లో 17 శాతం, అనంతనాగ్ లో 7.3 శాతం, బారాముల్లాలో 5.7 శాతం, బందిపొరా సెక్టార్లో అతితక్కువగా 3.3 శాతం నమోదైంది. కడపటి వార్తలు అందే సమయానికి పోలింగ్ ప్రశాంతంగానే జరిగింది. మొత్తం 4 విడతల్లో స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయి.
పోలింగ్ ముగిసే సమయానికి తమకు అందిన సమాచారాన్ని బట్టి జమ్మూ మున్సిపల్ కార్పొరేషన్ (జేఎంసీ)లో 63.83 శాతం నమోదైందని, అలాగే ఖౌర్ మున్సిపల్ కార్పొరేషన్లో 89 శాతం నమోదైందని అధికారులు చెబుతున్నారు. పోలింగ్ సిబ్బంది వెల్లడించే వివరాలే తుది ఫలితాలని, అవి రావడానికి మరికొంత సమయం పడుతుందని ఎన్నికల అధికారులు చెప్పారు.