పోయెస్ గార్డన్: జయలలిత వేదనిలయం, ఆమెతో ఆ నలుగురే...
జయలలిత నివాసం వేద నిలయం చెన్నైలోని పోయెస్ గార్డెన్లో ఉంటుంది. ఆమె నివాసం లోపల ఎలా ఉంటుందనేది ఆమెకు సన్నిహితులైన మంత్రులకు, అధికారులకు కూడా తెలియదు.
చెన్నై: పోయెస్ గార్డెన్ పేరు చెప్తే వెంటనే తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నివాసం గుర్తుకు వస్తుంది. చెన్నై మధ్యంలో అత్యంత విలాసవంతమైన ప్రాంతం ఇది. ఇక్కడ జయలలిత మాత్రమే కాకుండా పలువురు ప్రముఖులు నివాసం ఉంటారు.
జయలలిత ఇంటి పక్కనే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఉంటారు. పెప్సీకో సీఈవో, చెన్నైకే చెందిన ఇంద్రా నూయీ ఇటీవల ఇక్కడ రూ.7 కోట్లు పెట్టి అపార్టుమెంట్ బుక్ చేసుకున్నారు. తమిళ సినీ నటుడు కార్తీక్ ఇల్లు కూడా ఇక్కడే ఉంది. చెన్నైలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, న్యాయవాదుల ఇళ్లన్నీ ఇక్కడే ఉంటాయి.
వాటన్నింటిలో ఎల్ల వేళలా సందడిగా కనిపించేది జయలలితకు చెందిన 'వేద నిలయం' మాత్రమే. అది ఆమె నివాసం. ఆమె అధికారంలో ఉన్నా లేకున్నా కార్యకర్తలతో, నేతలతో సందడిగానే ఉంటుంది. తన తల్లి అసలు పేరు వేదవల్లి పేరిట ఆమె దానికి వేద నిలయం అని పేరు పెట్టారు. ఈ ఇంటిని 1967లోనే ఆమె రూ.1.32 లక్షలకు కొనుగోలు చేశారు. అప్పట్లో వరుసగా 11 సినిమాలు సూపర్ హిట్ కావడంతో వచ్చిన చిన్న మొత్తంతోనే జయ ఈ ఇంటిని కొనుగోలు చేశారు.

అది ప్రస్తుతం ప్రస్తుతం 24 వేల చదరపు అడుగుల్లో విస్తరించింది. ఇందులో బిల్టప్ ఏరియానే 21,662 చదరపు అడుగులు. ప్రస్తుతం దాని విలువ రూ.45 కోట్లకుపైగానే ఉంటుంది. 'వేద నిలయం'లోకి ప్రముఖులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. ఏదైనాప్రత్యేక కార్యక్రమం ఉంటే తప్పిస్తే మంత్రులకు కూడా ఈ భవనంలోకి ప్రవేశం ఉండదు.
ప్రత్యేక అనుమతి ఉన్న వారికి మాత్రమే వేద నిలయంలోకి ప్రవేశం ఉంటుంది. ముఖ్య నేతలు, విశ్వాసపాత్రులైన ఐఏఎస్లు కూడా ఈ ఇంటి లోపల ఎలా ఉంటుందో తెలియదని చెబుతుంటారు. వేద నిలయంలో 20 మందికి పైగా పనివాళ్లు ఉంటారని సమాచారం.
అయితే, జయలలిత వెంట మాత్రం శశికళ, ఆమె మరదలు ఇళవరసి, ఇరవయ్యేళ్ల వయసుండే ఇద్దరు యువతులు మాత్రమే ఉంటారు. జయకు అవసరమైన మాత్రల నుంచి ఆమెకు మేకప్ టచప్ ఇచ్చే వరకూ వీరిద్దరే చూసుకుంటారు. వేద నిలయం సమీపంలోనే వినాయకుడి చిన్న గుడి వంటిది ఉంటుంది. జయ ఇంటి బయటకు వచ్చినప్పుడు, లోపలికి వెళ్లేటప్పుడు ఇక్కడి విఘ్నేశ్వరునికి మొక్కి వెళ్తారు.












Click it and Unblock the Notifications