భర్తపై బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ వేధింపుల కేసు
ముంబై: బాలీవుడ్ నటి కరిష్మా కపూర్.. తనను వేధింపులకు గురి చేస్తున్నారంటూ భర్త, అత్తల పైన పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్త సంజయ్ కపూర్, అతని కుటుంబం తనను మానసికంగా వేధిస్తోందని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
గత కొద్ది రోజులుగా కరిష్మా కపూర్, సంజయ్ కపూర్ మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోయారు. తాజాగా కరిష్మా తన భర్త తరపు కుటుంబం తనని వేధింపులకు గురి చేస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కరిష్మా ఫిర్యాదుతో సంజయ్ కపూర్ అతని కుటుంబ సభ్యులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, సంబంధిత సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం వీరిద్దరూ పెట్టుకున్న విడాకుల కేసు బాంద్రా కుటుంబ న్యాయస్థానంలో ఉంది.
మరోవైపు, కరిష్మాకు కుటుంబ బాధ్యతలు నిర్వర్తించడం తెలియదని, డబ్బు కోసమే తనని పెళ్లి చేసుకుందని సంజయ్ కపూర్ ఆరోపిస్తున్నాడు. తన పిల్లలను అడ్డం పెట్టుకొని డబ్బు కావాలని అడుగుతోందన్నారు. పిల్లలను తనకు అప్పగించాలని భర్త పిటిషన్ వేశాడు. ఈ కేసు మార్చి 3న విచారణకు రానుంది.