కర్ణాటకలో రాష్ట్రపతి పాలన తప్పదా..? గవర్నర్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు..!!
బెంగళూరు : తుఫాన్ వచ్చే ముందు సమ్మగా ఉన్నట్టు .. ఒక్కసారిగా ఎమ్మెల్యేల రాజీనామా కర్ణాటక రాజీయాన్ని కుదిపేసింది. కాంగ్రెస్-జేడీఎస్కు చెందిన 13 మంది ఎమ్మెల్యేల రాజీనామా దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. కర్ణాటకలో ఏం జరగబోతుందోనని ఉత్కంఠ సర్వత్రా కొనసాగుతుంది. దీంతో అమెరికా నుంచి సీఎం కుమారస్వామి, తన నియోజకవర్గం నుంచి డీకే శివకుమార్ ఆగమనంతో కర్ణాటక రాజకీయాలు పీక్ హీట్కి చేరిపోయాయి. మిగతా కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో క్యాంపు నిర్వహిస్తున్నారు. అయితే కర్ణాటకలో రాజకీయ సంక్షోభంతో కాంగ్రెస్-జేడీఎస్ చేయనున్నాయి ? గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు ? బీజేపీని ప్రభుత్వ ఏర్పాటు కోసం ఆహ్వనిస్తారా ? లేదా రాష్ట్రపతి పాలన విధిస్తారా ?
టెన్షన్ .. టెన్షన్ ...
కర్ణాటక అసెంబ్లీలో 225 స్థానాలు ఉన్నాయి. అంటే 113 సీట్లు మ్యాజిక్ ఫిగర్. 113 సీట్లు గెలిచిన పార్టీని ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్ ఆహ్వానిస్తారు. అయితే ఇదివరకు జరిగిన ఎన్నికల్లో 104 సీట్లు గెలిచి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అవతరలించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు 9 సీట్ల దూరంలో నిలిచిపోయింది. దీంతో 80 సీట్లు గెలిచిన కాంగ్రెస్, 37 సీట్లు గెలిచిన జేడీఎస్ కూటమిగా ఏర్పడ్డాయి. ఈ రెండు పార్టీల బలం 117కి చేరింది. అయితే ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి జేడీఎస్, కాంగ్రెస్ పార్టీ మధ్య సఖ్యత లేదు. దీంతో ఓ సందర్భంగా సంకీర్ణ సర్కార్ తన వల్ల కావడం లేదని కుమారస్వామి కంటతడి పెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆనంద్ సింగ్ రాజీనామా చేశారు. దీంతో ఏం జరుగుతుందోనని ఆందోళన నెలకొంది. ఆ వెంటనే సమయం చూసి రెండు పార్టీలకు చెందిన 13 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ... రాజకీయ అస్థిరతకు కారణమయ్యారు.
మెనార్టీలో సర్కార్ ..
ఈ రెండు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేల రాజీనామాతో సంకీర్ణ ప్రభుత్వ మెజార్టీ పడిపోతుంది. ఆనంద్ సింగ్ రాజీనామాతో 116కి చేరిన బలం .. తాజాగా మరో 13 మంది ఎమ్మెల్యేలతో 103కి పడిపోతుంది. అంటే విపక్ష బీజేపీ కన్నా రెండు సీట్లకు చేరుతుంది. దీంతో గవర్నర్ కల్పించుకొని మెజార్టీ నిరూపించుకోవాలని సంకీర్ణ ప్రభుత్వానికి స్పష్టంచేశారు. ఒకవేళ మెజార్టీ నిరూపించలేకపోతే .. ఎన్నికలు నిర్వహించేందుకు మొగ్గుచూపతారు. అలా కాకుండా విపక్ష స్థానంలో ఉన్న బీజేపీని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరే అవకాశం ఉంది. ఈ ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతిస్తే ప్రభుత్వం ఏర్పడటం సులువైన విషయమే. కానీ వారు మరో పార్టీలో చేరతామని కానీ ప్రకటించలేదు. దీంతోపాటు వారు తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో అసెంబ్లీ సభ్యుల సంఖ్య 225 నుంచి 14 మంది సభ్యులు తీసి మెజార్టీ చూస్తారు. అప్పుడు 211 మంది సభ్యులు అవుతారు. లేదంటే సభకు హాజరైన సభ్యుల్లో సగం మంది కన్నా ఎక్కువమంది హాజరైతే అసెంబ్లీలో బలనిరూపణ నుంచి కుమారస్వామి సర్కార్ బయటపడుతుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అదీ సాధ్యపడకపోవచ్చు. ఎందుకంటే 211 మంది సభ్యులున్న 106 మంది మద్దతు కావాలి. లేదంటే సభకు తక్కువమంది హాజరైతే సరిపోతుంది. కానీ ఆ నియమ నిబంధలు వర్కవుట్ కానీ పరిస్థితి ఏర్పడుతుంది.
ఏం చేద్దాం ..?
దీంతోపాటు బీజేపీ కూడా ఆచితూచి అడుగులు వేస్తోంది. గోవా, ఇతర రాష్ట్రాల్లో చేసినట్టు కాకుండా రాష్ట్రపతి పాలన విధించాలనే ఆలోచనలో ఉంది. అలా చేసి .. తర్వాత ప్రెసిడెంట్ రూల్ ఎత్తేసి .. ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే యోచనలో ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. అలా అయితే కర్ణాటక సర్కార్ను బలం నిరూపించుకోవాలని గవర్నర్ కోరతారు. బలం నిరూపించకుంటే .. రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసే అవకాశం ఉంది. కర్ణాటకలో రాజకీయ సంక్షోభం నెలకొన్న నేపథ్ంలో .. రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.