చెడ్డపేరొద్దు: కెసిఆర్తో ప్రధాని, పరువు తీయొద్దు: సబ్బం
న్యూఢిల్లీ: హైదరాబాదు దేశానికి తలమానికమని, అలాంటి నగరానికి చెడ్డపేరు రాకుండా చూడాలని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సూచించారు. మంగళవారం ప్రధానితో కెసిఆర్ భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ప్రధాని... హైదరాబాదుకు చెడ్డపేరు రాకుండా చూడాలని, హైదరాబాదులో ఉన్న సీమాంధ్రులకు అభద్రత భావం కలగకుండా చూడాలని సూచించారు. ప్రధానికి కెసిఆర్ ఓ నివేదికను ఇచ్చారు. తెలంగాణ ఆవిర్భావ తేదిని ప్రకటించాలని, రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగకుంటే ప్రజల్లోకి సరైన సంకేతాలు వెళ్లవని కెసిఆర్ ప్రధానితో చెప్పారు.
తెలంగాణ పునర్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని, ఐఐఎం, ఎయిమ్స్ నెలకొల్పాలని, హైదరాబాదును మెట్రో పాలిటన్ సిటీగా చేయాలని, నిరుద్యోగ సమస్య తీర్చాలని, తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కెసిఆర్ తన నివేదికలో పేర్కొన్నారు. మరోవైపు, ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన బలం ఉందని పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ అన్నారు.
పరువు తీయొద్దు: సబ్బం
నెల రోజుల ముఖ్యమంత్రి పదవి కోసం సీమాంధ్ర ప్రాంత కాంగ్రెసు నేతలు తెలుగు ప్రజల పరువు తీయవద్దని అనకాపల్లి ఎంపి సబ్బం హరి మండిపడ్డారు. విభజన విషయంలో కాంగ్రెసు రాజకీయ లబ్ధి కోసం ఆలోచించలేదన్న వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెసు లాభనష్టాల గురించి ఆలోచించదని, అభివృద్ధి చెందుతున్న ఎపిని నాశనం చేసిందని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో జరిగే పరిణామాలను బట్టి తమ కార్యాచరణ ఉంటుందని చెప్పారు. ప్రజాభిమానం ఉంటే ఏమైనా చేయవచ్చునన్నారు.
ఓడిపోయాం: టిజి
తెలుగు జాతి విభజన క్రీడలో తాము ఓడిపోయామని చిన్న నీటి పారుదల శాఖ మంత్రి టిజి వెంకటేష్ కర్నూలులో ఆవేదన వ్యక్తం చేశారు. విభజన నేపథ్యంలో మౌనంగా కూర్చోకుండా హక్కుల కోసం పోరాడుదామన్నారు. కర్నూలును రాజధాని చేయకుంటే మరో పోరాటం చేస్తామన్నారు.