మీకు అలీ ఉంటే మాకు భజరంగభళీ ఉన్నాడు: యోగీ ఆదిత్యనాథ్
మధ్యప్రదేశ్ : కాంగ్రెస్ అలీని ఉంచుకోవచ్చని మాకు బజరంగబలి చాలని అన్నారు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్. మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ తరపున ప్రచారం చేసిన ఆయన కాంగ్రెస్ సీనియర్ నేత కమల్నాథ్కు ఈ కౌంటర్ ఇచ్చారు. కొన్ని రోజుల క్రితం ముస్లిం మత పెద్దలతో ఆ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు కాంగ్రెస్కు పడేలా చూడాలని చెబుతున్న వీడియో బయటపడటంతో యోగీ ఆదిత్యనాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ మధ్యే తాను ఓ పేపర్లో కమలనాథ్ గురించి చదివినట్లు చెప్పిన యోగీ... తనకు ఎస్సీ ఎస్టీ ఓట్లు వద్దన్నారని కేవలం ముస్లిం ఓట్లు మాత్రమే కావాలని అక్కడి మత పెద్దలను అభ్యర్థించినట్లు చదివినట్లు చెప్పారు యోగి. ఈ సందర్భంగా కమల్నాథ్ అలీ మీ దగ్గరున్నారేమో మాకు భజరంగబళి ఉన్నాడు చాలంటూ చెప్పారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 10 రోజుల్లోనే రైతుల రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు యోగీ ఆదిత్యనాథ్. అత్యధిక రైతులు ఉన్న పంజాబ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా... అక్కడ రుణమాఫీ ఎక్కడ జరిగిందని యోగీ ప్రశ్నించారు. అధికారంలో ఉన్న రాష్ట్రంలో రుణమాఫీలు చేయరుకానీ మరో రాష్ట్రంలో రుణమాఫీలు చేస్తారట అంటూ యోగీ ఆదిత్యనాథ్ ఎద్దేవా చేశారు.
ఇదిలా ఉంటే మధ్యప్రదేశ్లో ఎన్నికలు ఈనెల 28 జరగనున్నాయి. మొత్తం 230 స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు డిసెంబర్ 11న విడుదల కానున్నాయి. ఇప్పటికే బీజేపీ గత 15 ఏళ్లుగా అధికారంలో ఉండగా ఈ సారి ఎలాగైనా సరే అధికారంలోకి రావాలనే పట్టుదలతో కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోంది.