రూ.6.2కోట్లు చెల్లించాల్సిందే: లతా రజినీకాంత్కు సుప్రీం ఆదేశాలు
చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ సతీమణి లతా రజినీకాంత్కు సుప్రీంకోర్టు షాకిచ్చింది. ఓ ప్రైవేట్ యాడ్ కంపెనీకి రూ.6.2కోట్లు చెల్లించాల్సిందిగా సర్వోన్నత న్యాయస్థానం లతా రజినీకాంత్ను ఆదేశించింది. రజినీకాంత్ కథనాయకుడిగా నటించిన 'కొచ్చాడయన్' 2014 ఏప్రిల్ విడుదలైంది.
మీడియా వన్ గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై ఈ సినిమాను లత నిర్మాతగా వ్యవహరించారు. ఈ సంస్థకు లత ఎండీగా ఉన్నారు. ఈ సినిమాను దాదాపు రూ. 150 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కించారు.
కాగా, సినిమా చిత్రీకరణ పూర్తయ్యాక పోస్ట్ ప్రొడక్షన్ పనులకు డబ్బు సరిపోలేదు. దీంతో మీడియా వన్.. ఓ ప్రైవేటు యాడ్ కంపెనీ నుంచి అప్పు తీసుకుంది. ఆ తర్వాత తీసుకున్న అప్పు తిరిగి కట్టేసినట్లు మీడియా వన్ తెలిపింది.
కానీ, ఇంకా రూ.6.2కోట్లు బాకీ ఉందని యాడ్ కంపెనీ సుప్రీంకోర్టులో కేసు వేసింది. ఈ నేపథ్యంలో రెండు వారాల్లోగా పూర్తి బాకీ(రూ.6.2కోట్లు) చెల్లించాల్సిందిగా సుప్రీం తాజాగా ఆదేశాలు జారీ చేసింది.