దేశంలోనే తొలి శానిటరీ న్యాప్కిన్ ఫ్రీ గ్రామంగా కేరళలోని కుంబళంగి
తిరువనంతపురం: దేశంలోనే ఫస్ట్ శానిటరీ న్యాప్కిన్ రహిత గ్రామంగా కేరళ రాష్ట్రం ఎర్నాకుళంలోని కుంబళంగి అవతరించింది. కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ గురువారం దీనికి సంబంధించిన ప్రకటన చేయనున్నారు. ఎర్నాకుళం నియోజకవర్గంలో జరుగుతున్న ప్రత్యేక ప్రచారంలో భాగంగా కుంబళంగి ఈ ఘనత సాధించింది.
ఈ కార్యక్రమంలో భాగంగా.. 18 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళలకు మెన్స్ట్రువల్ కప్పులు పంపిణీ చేయనున్నారు. మొత్తం 5000 మెన్స్ట్రువల్ కప్పులను అందించనున్నట్టు అధికారులు తెలిపారు.

పార్లమెంట్ సభ్యుడు హిబీ ఈడెన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎర్నాకుళం పార్లమెంటరీ నియోజకవర్గంలో అమలవుతున్న 'అవల్కాయి' (ఆమె కోసం) పథకంలో భాగంగా ఈ ప్రాజెక్ట్ అమలు చేస్తున్నారు. ఈ పథకం అమలులో హెచ్ఎల్ఎల్ మేనేజ్మెంట్ అకాడమీ వారి 'తింగల్' పథకం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ భాగస్వాములుగా ఉన్నాయి.
కాగా, ఇదే కార్యక్రమంలో కుంబళంగిని మోడల్ విలేజీగా గవర్నర్ ప్రకటించనున్నారు. మోడల్ విలేజ్ ప్రాజెక్ట్ ప్రధానమంత్రి సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన(SAGY) ద్వారా అమలు చేస్తున్నారు. కొచ్చిలో పర్యాటకులకు ప్రధాన ఆకర్షణలలో ఒకటైన కుంబళంగిలో కొత్త పర్యాటక సమాచార కేంద్రం కూడా ఉంటుంది. ఇది భారతదేశపు మొట్టమొదటి మోడల్ టూరిస్ట్ గ్రామం అనే బిరుదును కూడా పొందడం గమనార్హం.












Click it and Unblock the Notifications