రాహుల్కు లలిత్ మోడీ కౌంటర్!.. బ్రిటన్ కోర్టుకీడ్చుతానని వార్నింగ్!
ఢిల్లీ : కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీకి బ్యాడ్ టైం నడుస్తున్నట్లుంది. ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ఆయన ఏం మాట్లాడినా వివాదాస్పదమవుతోంది. రాఫెల్ డీల్ కేసుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సుప్రీంకోర్టు నోటీసులందుకున్న ఆయన.. తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. మోడీ సర్ నేమ్పై రాహుల్ చేసిన కామెంట్లకు బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ మోడీ ఇప్పటికే న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తాజాగా ఐపీఎల్ కేసులో నిందితుడైన మోడీ లలిత్ మోడీ సైతం రాహుల్ను కోర్డు కీడ్చుతానని వార్నింగ్ ఇచ్చారు.
బ్రిటన్ కోర్టుకీడ్చుతా
దొంగలిందరి ఇంటిపేరులో మోడీ పేరు ఉందంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఐపీఎల్ కేసులో నిందితుడు లలిత్ మోడీ ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ ప్రెసిడెంట్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీలను అవమానించేలా మాట్లాడిన రాహుల్ను బ్రిటన్ కోర్డుకీడ్చుతానని వార్నింగ్ ఇచ్చారు. ఐదు దశాబ్దాల పాలనలో దేశాన్ని దోచుకున్నది గాంధీ - నెహ్రూ కుటుంబమేనన్నది జగమెరిగిన సత్యమని లలిత్ మోడీ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ను ప్రధాని నరేంద్రమోడీకి ట్యాగ్ చేశారు.
కోర్టును ఆశ్రయించిన సుశీల్ మోడీ
మోడీలంతా దొంగలేనంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. రాహుల్ కామెంట్లు మోడీ అనే ఇంటిపేరు కలిగిన లక్షల మందిని అగౌరవపరిచేలా ఉందంటూ బీహార్ డిప్యూటీ సీఎం, బీజేపీ నేత సుశీల్ మోడీ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు ఏప్రిల్ 22న విచారణకు రానుంది. మరోవైపు ప్రధాని మోడీ కూడా రాహుల్ వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పుబట్టారు. కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఇలాంటి భాష వాడటం తగునా అని ప్రశ్నించారు. ఆయన తన మాటలతో దేశంలోని వెనకబడిన వర్గాలన్నింటినీ అవమానించారని ఆరోపించారు.
మోడీలంతా దొంగలే
మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ దొంగలందరి పేరులో మోడీ ఎందుకు ఉందని వ్యాఖ్యానించారు. వేల కోట్ల రూపాయల బ్యాంకు రుణాల ఎగవేత కేసులో నీరవ్ మోడీ, ఐపీఎల్ వ్యవహారంలో లలిత్ మోడీ, రాఫెల్ డీల్ విషయంలో ప్రధాని మోడీ నిందితుడంటూ ఆయన చేసిన కామెంట్లు పెద్ద దుమారమే రేపాయి.