ఆరోస్సారి.. పాన్ - ఆధార్ లింకింగ్ గడువు పెంపు.. ఎప్పటివరకో తెలుసా?
ఢిల్లీ : పాన్ కార్డ్ - ఆధార్ కార్డ్ లింకింగ్ గడువు మరోసారి పెరిగింది. ఇప్పటివరకు ఐదుసార్లు గడువు పెంచింది కేంద్ర ప్రభుత్వం. తాజాగా పెంచిన గడువుతో ఇది ఆరోసారి. లింకింగ్ కు 2019, మార్చి 31వ తేదీ తుది గడువు అంటూ వారం రోజులుగా మీడియాలో, సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. చివరి తేదీ అయిన ఆదివారం సాయంత్రం నాడు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేస్తూ మరో 6 నెలలు గడువు పెంచుతున్నట్లు ప్రకటించింది.
ఖబడ్దార్.. రెచ్చిపోయిన కేంద్రమంత్రి.. అధికారిపై ఆగ్రహం (వీడియో)
మార్చి 31వ తేదీన ముగిసిన లింకింగ్ గడువును 2019, సెప్టెంబర్ 30 వరకు పెంచింది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (CBDT). ఆ మేరకు అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది. ఆదాయపు పన్ను శాఖ పాన్ - ఆధార్ లింకింగ్ తప్పనిసరి అంటూ పేర్కొంది. అంతేకాదు 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేవారు ఈ రెండు కార్డులను అనుసంధానం చేసుకోవాల్సిందే అంటూ తెలిపింది.
2018, సెప్టెంబర్ నాటికి నలభై ఒక్క కోట్ల పాన్ కార్డులు జారీ అయ్యాయి. వాటిలో ఇరవై ఒక్క కోట్ల పాన్ కార్డులు, ఆధార్ కార్డులతో లింకింగ్ పూర్తయ్యాయి. ఐటీ రిటర్న్స్ దాఖలుకు.. పాన్ కార్డులను ఆధార్ కార్డులతో అనుసంధానించడం తప్పనిసరంటూ సుప్రీంకోర్టు కూడా ఆదేశాలిచ్చింది. 2017, జులై 31వ తేదీ లింకింగ్ కు చివరితేదీ అంటూ అలా అలా పొడిగిస్తూనే ఉంది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుత పొడిగింపుతో అది ఆరోసారికి చేరినట్లైంది.