నేరాలపై అబద్ధాలాడితే అనర్హత వేటే: నేతల కేసులపై సుప్రీం హెచ్చరిక
న్యూఢిల్లీ: ఎన్నికల్లో పోటీ చేసే వారు, వారిపై ఉన్న క్రిమినల్ కేసులను రహస్యంగా ఉంచినట్లయితే వేటు తప్పదని సుప్రీం కోర్టు గురువారం హెచ్చరించింది. ‘గతంలో తమపై నమోదైన క్రిమినల్, అవినీతి కేసులకు సంబంధించిన సమాచారాన్ని అభ్యర్థులు రహస్యంగా ఉంచకూడదు. ప్రజా జీవితంలో అవినీతికి, నేరాలకు చోటు లేదు' అని జస్టిస్ దీపక్ మిశ్రాతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
మద్రాసు హైకోర్టు 2006లో కోయంబత్తూరు పంచాయతీ సభ్యుడిపై ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ సుప్రీం కోర్టు ఈ మేరకు పేర్కొంది. ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో నామినేషన్ పత్రాల్లో పేర్కొన్న అంశాల్లో తనపై ఉన్న క్రిమినల్ కేసులను దాచిన కారణంగా కోర్టు.. అతడ్ని ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేసింది.
హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ పంచాయతీ సభ్యుడు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. 2013లో ఉన్నత న్యాయస్థానం హైకోర్టు తీర్పును సమర్థిస్తూ.. ఎన్నికల్లో గెలిచిన ప్రజాప్రతినిధులు వారిపై ఉన్న కేసులను దాచినట్లయితే వారిని అనర్హత వేటుకు గురి చేయడం సరైందేనని పేర్కొంది. రెండేళ్ల జైలు శిక్ష కూడా విధించింది.
కాగా, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా తేలడంతో ఏఐఏడిఎంకె అధ్యక్షురాలు జె జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రి పదవికి సెప్టెంబర్, 2014లో రాజీనామా చేసిన విషయం తెలిసిందే.