సామాన్యుల దీపావళి మీ చేతుల్లోనే: మారటోరియంపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: కరోనా సంక్షోభంలో రుణగ్రహీతలకు ఇచ్చిన మారటోరియం కాలంలో విధించిన చక్రవడ్డీ విషయంపై సుప్రీంకోర్టు బుధవారం విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. రూ. 2 కోట్ల వరకు ఉన్న రుణాలపై చక్రవడ్డీ మాఫీ అమలు ఏమైందని జస్టిస్ అశోక్ భూషణ్ సుప్రీం ధర్మాసనం కేంద్రాన్ని ప్రశ్నించింది.
ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు: పెరిగిన రికవరీ, యాక్టివ్ కేసుల తగ్గుముఖం
చక్రవడ్డీ మాఫీపై నిర్ణయం తీసుకున్నామని, అయితే, ఇంకా అమలు చేయలేదని సోలిసిటరీ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. రూ. 2 కోట్ల వరకు ఉన్న రుణాలపై చక్రవడ్డీ మాఫీ చేస్తామని బ్యాంకుల తరపున న్యాయవాది హరీశ్ సాల్వే కూడా కోర్టుకు తెలిపారు.
చక్రవడ్డీ మాఫీ చేస్తామని నిర్ణయం తీసుకున్న తర్వాత అమలు చేయడంలో ఎందుకు జాప్యం జరుగుతోందని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. రుణాలు ఇవ్వడంలో విభిన్న పద్ధతులుంటాయని, అందుకే బ్యాంకులతో సంప్రదింపులు జరిపినట్లు తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు.
కేంద్రం ఇచ్చిన సమాధానంపై అసంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. చక్రవడ్డీ మాఫీ విషయంలో కేంద్ర నిర్ణయంపై సామాన్య ప్రజల్లో ఆందోళన నెలకొని ఉందని పేర్కొంది. సామాన్యులకు ఊరటనిచ్చే నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని, అయితే, ఈ నిర్ణయాన్ని కేంద్రం త్వరగా అమలు చేయాలని కోరుకుంటున్నట్లు జస్టిస్ ఎంఆర్ షా అన్నారు.
సామాన్యుల దీపావళి మీ చేతుల్లోనే ఉందని కేంద్రాన్ని ఉద్దేశిస్తూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తదుపరి విచారణ సమయానికి చక్రవడ్డీ మాఫీ అమల్లోకి వస్తుందని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆశాభావం వ్యక్తం చేసింది. నవంబర్ 2కి తదుపరి విచారణను వాయిదా వేసింది.