గణతంత్ర దినోత్సవం వేళ.. బాంబులు విసురుకున్నారు: తీవ్ర ఉద్రిక్తత
గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం యావత్ దేశం ముస్తాబైన వేళ.. తమిళనాడులో హింసాత్మక పరిస్థితులు చోటు చేసుకున్నాయి. వరుస దాడులు సంభవించాయి. మధురైలో వేర్వేరు ప్రాంతాల్లో పెట్రోల్, కిరోసిన్ బాంబులు విసిరారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ ఘటనల్లో స్థానికులు గాయపడ్డారు. పోలీసులు వారిని ఆసుపత్రికి తరలించారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనన్న నేపథ్యంలో తలెత్తిన ఈ ఉద్రిక్తత రాజకీయ రంగును పులుముకుంటోంది.
రాత్రి ద్విచక్ర వాహనాలపై వచ్చిన ముగ్గురు గుర్తుతెలియని దుండగులు సుబ్రమణ్యపురం మార్కెట్ వద్ద పెట్రోల్ బాంబు, సోలై అళగుపురం పరిధిలోని మహాలక్ష్మి నగర్ సమీపంలో కిరోసిన్ బాంబు విసిరారు. జైహింద్పురం సమీపంలో జరిగిన మరో ఘటనలో గుర్తుతెలియని వ్యక్తులు ఇద్దరు యువకులపై దాడి చేసి పారిపోయారు. గాయపడిన వారిని చికిత్స కోసం ప్రభుత్వ రాజాజీ ఆసుపత్రికి తరలించారు. ఈ మూడు సంఘటనలు జైహింద్పురం పోలీస్ స్టేషన్ పరిధిలోనే జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఈ ఘటనల అనంతరం జైహింద్పురం పోలీసులు, ఉన్నతాధికారులు సంఘటనా స్థలాలకు చేరుకుని విచారణ ప్రారంభించారు. గతంలో జరిగిన పెరంబలూర్ పెట్రోల్ బాంబు దాడికి ప్రతీకార చర్యగా ఈ ఘటన జరిగి ఉండవచ్చని అనుమానిస్తోన్నారు. దీంతో పాటు పలు కోణాల్లో పోలీసులు కేసులను దర్యాప్తు చేస్తున్నారు. పెరంబలూర్ ఘటన మధురై దాడులకు మూలంగా భావిస్తున్నారు. పెరంబలూర్ ఘటన ఈ నెల జనవరి 24వ తేదీన జరిగింది.
చెన్నైకి గంజాయి కేసు నిందితుడు, దిండిగల్ హిస్టరీ షీటర్ అయిన కాళి అనే నిందితుడిని తరలిస్తున్న సమయంలో పోలీసు ఎస్కార్ట్ టీమ్ పై బాంబులు విసిరారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. ఇరయ్యూర్ సమీపంలో జాతీయ రహదారిపై ఓ హోటల్ వద్ద పోలీసులు ప్రయాణిస్తున్న కాన్వాయ్ ఆగినప్పుడు నిందితులు పెట్రోల్ బాంబు విసిరారు. దీనికి ప్రతీకారంగా సుబ్రమణ్యపురం, మహాలక్ష్మినగర్ లో తాజాగా దాడులు చోటు చేసుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తోన్నారు.












Click it and Unblock the Notifications