మధుర నుండి పోటీ విధి లిఖితం, నా కల: హేమమాలిని
లక్నో: తాను మధుర నియోజకవర్గం నుండి పోటీ చేయడం దైవ నిర్ణయమని భారతీయ జనతా పార్టీ అభ్యర్థి హేమ మాలిని సోమవారం అన్నారు. శ్రీకృష్ణ పరమాత్ముడు నడయాడిన మధుర నుంచి బిజెపి తరఫున లోకసభకు పోటీ చేయడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందన్నారు.
ఇది విధి లిఖితమని హేమ మాలిని సంతోషాన్ని వ్యక్తం చేశారు. మధుర నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలన్నది తన చిరకాల స్వప్నమని, అందుకే నోయిడా, ఘజియాబాద్ నియోజకవర్గాలను పక్కకు నెట్టి ఈ నియోజకవర్గాన్ని ఎంచుకున్నానని ఆమె చెప్పారు.
తన తొలి చిత్రం ‘సప్నోంకా సౌదాగర్' విడుదలకు ముందు ఉన్నంత బెరుకు ఇప్పుడు లేదని, మధుర, నోయిడా, ఘజియాబాద్ నియోజకవర్గాల్లో ఏదో ఒకదానిని ఎంచుకునే అవకాశం బిజెపి నాయకత్వం తనకు కల్పించగా, మధుర నియోజకవర్గాన్ని ఎంచుకున్నానని, ఈ ప్రాంతానికి ఏదైనా చేయాలని తాను ఎప్పటి నుంచో ఎదురుచూస్తుండటమే ఇందుకు కారణమని ఆమె తెలిపారు.
మధుర నుంచి పోటీ చేయాలన్నది తన చిరకాల స్వప్నమని, ఈ విషయాన్నే బిజెపి అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్కు చెప్పానని, మధుర గురించి ఎప్పుడు ఆలోచించినా అందరికీ కృష్ణ పరమాత్ముడే మదిలో మెదలుతాడన్నారు. కలియుగ దైవంగా పూజలందుకుంటున్న శ్రీకృష్ణుడు నడయాడిన ఈ పుణ్యభూమిలో ఇప్పుడు ఎటుచూసినా అపరిశుభ్రమైన వాతావరణమే దర్శనమిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచి మధుర పవిత్రతను కాపాడటమే తన ప్రధాన లక్ష్యమన్నారు.