గొడవ: భార్య తన వెంట రాలేదని కొడుకు తల నరికివేత
పోలీసుల కథనం ప్రకారం.. నిందితుడు ఛమన్ గోమేటి తన భార్యతో శనివారం గొడవపడ్డారు. దీంతో ఆమె తన పుట్టింటికి వెళ్లిపోయింది. కాగా సోమవారం తన భార్యను తీసుకువచ్చేందుకు ఛమన్ తన అత్తవారింటికి వెళ్లాడు. అయితే అతని భార్య తనతో వచ్చేందుకు నిరాకరించింది. దీంతో అతని భార్య, అత్తతో నిందితుడు ఛమన్ గొడవకు దిగాడు. తన కూతుర్ను పంపించనని అతని అత్త తేల్చి చెప్పింది.
ఈ నేపథ్యంలో తీవ్ర ఆగ్రహానికి గురైన ఛమన్ అధిక మొత్తంలో మద్యం సేవించాడు. సోమవారం రాత్రి ఛమన్ గోమేటి మద్యం మత్తులో తిరిగి తన అత్తగారింటికి వచ్చాడు. అతని మామ పక్కన నిద్రిస్తున్న తన కొడుకును పక్కకు లాగి కత్తితో అతని తలనరికాడు. ఆ తర్వాత అక్కడ్నుంచి పరారయ్యాడు.
నిద్రలో ఉన్న అతని మామ నిందితుడ్ని ఆపలేకపోయారని నిందితుడి భార్య కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. హత్య కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడు ఛమన్ను అరెస్ట్ చేశారు. ఛమన్ తన కొడుకును ఆవేశంలోనే హత్య చేశాడని పోలీసులు తెలిపారు.