ఇంటికి ఆలస్యంగా వచ్చిందని భార్యను కొట్టిచంపాడు
ముంబై: మహారాష్టలోని నేరుల్ ఎంఐడిసిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇంటికి ఆలస్యంగా వచ్చిందని కట్టుకున్న భార్యనే చంపేశాడు ఓ కసాయి భర్త. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, నిందితుడు విజయ్ ముండా(42)ను అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళితే.. నిందితుడి భార్య బుధిని కుమారి శుక్రవారం ఉదయం ఇంటి నుంచి బయటికి వెళ్లింది. ఆమె తిరిగి శనివారం ఉదయం 2గంటల ప్రాంతంలో తిరిగి ఇంటికి వచ్చింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన విజయ్ ముండా ఆమెను కర్రతో తీవ్రంగా కొట్టాడు. దీంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది.
తీవ్ర గాయాలపాలైన ఆమెను సమీపంలోని ఎన్ఎంఎంసి ఆస్పత్రికి తరలించారు. కాగా, అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడ్ని అరెస్ట్ చేశారు.
నిందితుడు విజయ్ ముండా నేరాన్ని అంగీకరించాడని పోలీసులు తెలిపారు. ఏడు రోజులపాటు పోలీస్ కస్టడీ విధించినట్లు చెప్పారు.