వ్యక్తిగత సిబ్బందికి మన్మోహన్ గుడ్బై: మేధావన్న జైట్లీ
న్యూఢిల్లీ: తన వ్యక్తిగత సిబ్బందికి సౌత్ బ్లాక్లోని కార్యాలయంలో ప్రధాని మన్మోహన్ సింగ్ వీడ్కోలు పలికారు. ఇప్పటి వరకు వారందించిన సహాయానికి మన్మోహన్ సింగ్ కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం ఆయన 110 మంది వ్యక్తిగత సిబ్బందిని కలిసి వారికి కృతజ్ఞతలు తెలిపారు.
2004లో ప్రధాని పదవి చేపట్టిన మన్మోహన్ సింగ్కు సౌత్ బ్లాక్లోని సుమారు 400 మంది సిబ్బంది ఆయనకు చప్పట్లతో స్వాగతం పలికారు. కాగా, ప్రధాని మన్మోహన్ తన చివరి కేబినెట్ సమావేశాన్ని శనివారం నిర్వహించనున్నారు. ఆ తర్వాత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలువనున్నారు. ప్రణబ్ ముఖర్జీని కలిసిన అనంతరం ఆయన జాతినుద్దేశించి ప్రసంగించనున్నట్లు సమాచారం.
అదే రోజున మన్మోహన్ తన మంత్రివర్గంలోని సభ్యులకు తేనేటీ విందు ఇవ్వనున్నట్లు తెలిసింది. రాష్ట్రపతి కూడా వారందరికి విందు ఇవ్వనున్నారు. కాగా, కొత్త ప్రధానికి స్వాగతం పలికేందుకు పిఎంఓ కొత్త మెరుగులు దిద్దుకుంటోంది.
మన్మోహన్ మేధావే.. కానీ: అరుణ్ జైట్లీ
ప్రధాని మన్మోహన్ సింగ్పై భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ ప్రశంసల వర్షం కురిపించారు. మన్మోహన్ సింగ్ ఓ గొప్ప మేధావి అని చెప్పిన ఆయన, మంచి నాయకుడు కాలేకపోయారని అన్నారు. ఈ మేరకు జైట్లీ తన బ్లాగులో పేర్కొన్నారు. మన్మోహన్ సింగ్ అనేక విషయాలపై సంపూర్ణ అవగాహన ఉన్న వ్యక్తని అన్నారు. మన్మోహన్ సమర్థుడైన ఆర్థిక వేత్త అని ఆయన తెలిపారు. 1991లో గొప్ప ఆర్థిక సంస్కరణలు చేపట్టేందుకు ఆనాటి ప్రధాని పివి నరసింహారావు ప్రభుత్వం ఆయనకు ఎంతో సహకరించిందని తెలిపారు.
మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా తన సత్తా చాటారని కొనియాడారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆయనను ప్రధానిగా ప్రకటించాక మన్మోహన్ పరిధి తగ్గిపోయిందని అన్నారు. మన్మోహన్ తన ప్రసంగాలతో జాతిని ప్రభావితం చేయలేకపోయారన్నారు. పార్టీకి విశ్వాసంగా ఉండే ప్రయత్నంలో మన్మోహన్ సింగ్ తన కర్తవ్యాన్ని విస్మరించారని వ్యాఖ్యానించారు. దీన్ని మార్చుకునేందుకు కూడా ఆయన ప్రయత్నించలేదని జైట్లీ తన బ్లాగులో పేర్కొన్నారు. మన్మోహన్ సింగ్ తన సొంత నిర్ణయాలను తీసుకుకోలేకపోయారని అన్నారు.