పెద్దోళ్లయ్యారు: సోదరుడు బిజెపిలో చేరడంపై మన్మోహన్
న్యూఢిల్లీ: తన సోదరుడు దల్జీత్ సింగ్ కోహ్లీ భారతీయ జనతా పార్టీలో చేరిన అంశంపై ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ శనివారం స్పందించారు. తన సోదరుడు బిజెపిలో చేరడం విచారకరమని, సోదరులు పెద్దవాళ్లయ్యారని, వారిని ఇప్పుడు నియంత్రించలేకపోతున్నామని మన్మోహన్ అన్నారు. కాగా, మన్మోహన్ సోదరుడు దల్జిత్ సింగ్ నిన్న బిజెపిలో చేరారు. ఆయన చేరికతో తాము షాక్కు గురయ్యామని కుటుంబ సభ్యులు చెప్పారు.
మోడీ కన్నా మొనగాడు లేడు
మన దేశంలో తమ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ కన్నా దమ్మున్న మొనగాడు లేడని సరబ్జిత్ సింగ్ సోదరి దల్బీర్ కౌర్ అన్నారు. 49 ఏళ్ల సరబ్జిత్ను గత ఏప్రిల్ 26న లాహోర్ జైలులో తోటి ఖైదీలు చంపేసిన సంగతి తెలిసిందే. 1990లో స్నేహితుడితో కలసి మద్యం సేవించిన సరబ్ జిత్... మైకంలో బోర్డర్ దాటి పాకిస్తాన్లో అడుగుపెట్టాడు.
అతన్ని అదుపులోకి తీసుకున్న పాక్ ఆర్మీ లాహోర్, ముల్తాన్లలో జరిగిన బాంబు పేలుళ్లకు సరబ్ కారణమంటూ అభియోగాలు మోపింది. ఈ నేపథ్యంలో సరబ్కు ఉరిశిక్ష పడింది. అయితే, 2009లో సరబ్ ఉరిశక్షను అక్కడి కోర్టు నిలిపివేసింది.
ఈ నేపథ్యంలో అమాయకుడైన తన సోదరుడి చావుకు కారణమైన పాక్కు బుద్ధి చెప్పే సత్తా ఒక్క నరేంద్ర మోడీకే ఉందని సరబ్ సోదరి దల్బీర్ కౌర్ అన్నారు. చైనా, పాక్లతో పాటు ఏ సరిహద్దు దేశానికైనా వెన్నులో చలి పుట్టించగల ఏకైక నేత మోడీ అని తెలిపారు. 2012లో పాక్ ఖైదీ సలీం చిస్తీని భారత్ విడుదల చేసినప్పుడు పాక్ నుంచి సరబ్ను విడిపించుకునే అవకాశం వచ్చినా చేతగాని మన్మోహన్ ప్రభుత్వం వల్ల ఆ అవకాశం పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.