టోల్ గేట్ల వద్ద ఇదీ సీన్: 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్..!!
New year 2024: ఏపీ, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా కొత్త ఏడాది కోలాహలం క్రమంగా నెలకొంటోంది. క్రిస్మస్ సెలవులు దీనికి తోడయ్యాయి. వరుస సెలవులు రావడంతో జనం తమ స్వస్థలాల వైపు పరుగులు తీస్తోన్నారు. దర్శనీయ స్థలాలు, పర్యాటక కేంద్రాలు సైతం సందర్శకులతో పోటెత్తుతున్నాయి.
దీని ప్రభావం టోల్ గేట్లపై పడుతోంది. టోల్ గేట్లను దాటడానికి గంటల కొద్దీ సమయం పడుతోంది. కిలోమీటర్ల కొద్దీ వాహనాల రాకపోకలు స్తంభించిపోతున్నాయి. ఫాస్ట్ ట్యాగ్ ఉన్నప్పటికీ.. జాప్యం మాత్రం తప్పట్లేదు వాహనదారులకు. సాంకేతిక కారణాల వల్ల కొన్ని చోట్ల ఫాస్ట్ ట్యాగ్ రీడర్స్ పని చేయట్లేదనే ఫిర్యాదులు అందుతున్నాయి.

దీనివల్ల టోల్ గేట్ల వద్ద విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. కర్ణాటకలోని బెంగళూరు- మైసూర్ ఎక్స్ప్రెస్ వే పై గల టోల్ గేట్ల వద్ద రెండు కిలోమీటర్ల వరకు వాహనాలు స్తంభించిపోయాయంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. బెంగళూరు నుంచి ఇతర నగరాలకు వెళ్లే మార్గాల్లో ఉన్న అన్ని టోల్ గేట్ల వద్ద దాదాపుగా ఇదే పరిస్థితి నెలకొని ఉంది.
కర్ణాటక ప్రభుత్వం పాఠశాలలకు వారం రోజుల పాటు సెలవులను ప్రకటించడం వల్ల జనం దర్శనీయ స్థలాలు, పర్యాటక కేంద్రాలకు పోటెత్తారు. మైసూరు, కూర్గ్, మంగళూరు, చిక్మగళూరు, తమిళనాడులోని అరుణాచలం.. వంటి ప్రాంతాలను సందర్శించడానికి బారులు తీరారు. దీని ప్రభావం టోల్ గేట్లపై పడింది.

బెంగళూరు- అనంతపురం, బెంగళూరు- హిందూపురం, బెంగళూరు-కృష్ణగిరి, బెంగళూరు- హసన్ వంటి మార్గాల్లో టోల్ గేట్లను దాటడానికి గంటల కొద్దీ సమయం పడుతోంది. కొన్ని చోట్ల ఫాస్ట్ ట్యాగ్ రీడర్స్ పనిచేయకపోవడం కూడా వాహనాల తాకిడి భారీగా పెరిగిపోవడానికి కారణమౌతోంది.












Click it and Unblock the Notifications