Matrimony frauds: మ్యాట్రిమోనీ సైట్లో బడా ఛీటింగ్.. బాధితురాలి వీడియోపై CEO వివరణ
Bharat Matrimony: ఇటీవల ఆన్లైన్ మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కొందరు డబ్బుల కోసం నేరుగా వ్యక్తుల బ్యాంక్ అకౌంట్లను టార్గెట్ చేస్తుంటే మరికొందరు వ్యాపారాభివృద్ధి కోసం తప్పుడు పనులకు పాల్పడుతున్నారు. తద్వారా కస్టమర్స్ను ఆకర్షించి బిజినెస్ పెంచుకోవాలని, లాభాలు గడించాలని కుటిల పన్నాగాలు పన్నుతున్నారు.
దేశంలో ప్రముఖ మ్యాట్రిమోనియల్ ప్లాట్ఫారమ్ భారత్ మ్యాట్రిమోనీపై ఇటీవల ఒక మహిళ తీవ్ర ఆరోపణలు చేసింది. సదరు సైట్ తన ఫోటోను వినియోగించి నకిలీ ప్రొఫైల్ క్రియేట్ చేశారని స్వాతి ముఖుంద్ అనే మహిళ మండిపడ్డారు. ఈ ప్లాట్ఫారమ్ ద్వారా భాగస్వామిని కలుసుకున్నట్లుగా తప్పుగా సూచించారని, కానీ అది నిజం కాదని స్పష్టం చేశారు. దీంతో సదరు ప్లాట్ఫారమ్పై సోషల్ మీడియా వినియోగదారులు దుమ్మెత్తిపోస్తున్నారు.

ఇన్స్టాగ్రామ్ వీడియోలో భారత్ మ్యాట్రిమోనీ తన అనుమతి లేకుండా తన చిత్రాన్ని ప్రొఫైల్లో ఉపయోగించినట్లు స్వాతి ఆరోపించారు. ఇది చెన్నైకి చెందిన నిత్యా రాజా శేఖర్ అనే వ్యక్తికి చెందిన ప్రొఫైల్గా తెలుస్తోంది. అధిక స్క్రీనింగ్ మరియు ప్రామాణికతను హామీ ఇస్తూ ప్రీమియం వినియోగదారుల కోసం డిజైన్ చేసిన సేవలో ఇదొక భాగమని ఆమె పేర్కొంది.
ఘటనపై భారత్ మ్యాట్రిమోనీ స్పందిస్తూ, ఆమెకు క్షమాపణలు తెలిపింది. ఆ ప్రొఫైల్ని సస్పెండ్ చేయడమే కాకుండా దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించింది. తమ సమాచారం భద్రంగా ఉంచుకునే విషయంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా భారత్ మ్యాట్రిమోనీలో సుమారు 25 శాతం ప్రొఫైల్స్ బంధువులచే సృష్టించబడతాయని సంస్థ CEO జానకీరామన్ వివరించారు. తద్వారా కొన్నిసార్లు నకిలీ ప్రొఫైల్స్ సృష్టించబడే అవకాశం ఉందన్నారు. ఇటువంటి సమస్యలను పూర్తిగా నివారించడంలో తాము విఫలమయ్యామని, ఇది పరిశ్రమవ్యాప్తంగా ఎదుర్కొంటున్న సమస్యగా అంగీకరించారు.












Click it and Unblock the Notifications