మంత్రి పదవి కోసం భారీ బిర్యానీ విందునిచ్చిన ఎమ్మెల్యే
చెన్నై : మంత్రి పదవిని ఆశిస్తోన్న అన్నాడీఎంకే ఎమ్మెల్యే పరమేశ్వరి.. తన కోరిక నెరవేరడం కోసం స్థానిక సట్టికరుప్పు ఆలయంలో అక్కడి ప్రజలకు భారీ స్థాయిలో బిర్యానీ విందు ఏర్పాటు చేశారు. తిరుచ్చి జిల్లా మన్నానల్లూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు పరమేశ్వరి.
దాదాపుగా 3వేల మందికి బిర్యానీ విందునిచ్చిన పరమేశ్వరి.. ఇందుకోసం 25 మేకపోతులు, 250 కోళ్లను బలి ఇచ్చినట్లుగా సమాచారం. సాధారణ ప్రజానీకంతో పాటు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పలువురు ప్రముఖులు ఈ విందుకు భారీ స్థాయిలో హాజరయ్యారు.
విందు ఏర్పాటుపై స్పందించిన పరమేశ్వరి.. ఎమ్మెల్యేగా గెలుపొందినందుకు, అన్నాడీఎంకే పాలనా వందరోజులు పూర్తి చేసుకున్నందుకు గాను ఈ విందు ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. అయితే స్థానిక నాయకులు మాత్రం మంత్రి పదవిని ఆశిస్తోన్న పరమేశ్వరి అమ్మవారి అనుగ్రహం కోసం ఈ విందును ఏర్పాటు చేసినట్లుగా చెబుతున్నారు. ఏదేమైనా పరమేశ్వరి ఏర్పాటు చేసిన ఈ భారీ విందు తారాపురంలో హాట్ టాపిక్ గా మారింది.