నాపై మీకు పూర్తి అధికారం: మోడీ, బాబుకి ప్రత్యేకంగా..
న్యూఢిల్లీ: కాబోయే భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎన్డీయే భాగస్వామ్య పక్షాలకు హామీ ఇచ్చారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలకు తన పైన పూర్తి అధికారముందని, వారు ఎప్పుడైనా తనను స్వేచ్ఛగా కలువవచ్చునని చెప్పారు. బిజెపికి మెజార్టీ రాకుంటే భాగస్వామ్య పక్షాలకు ఎంత ప్రాధాన్యత ఉంటుందే ఇప్పుడు కూడా అంతే ఉంటుందని హామీ ఇచ్చారు.
ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు అన్ని విజయం కోసం ఎంతో కష్టపడ్డాయన్నారు. రాజకీయాలకు అతీతంగా పని చేశాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో విజయానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఎంతో కృషి చేశారని చెప్పారు. చంద్రబాబుకు మోడీ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
అంతకుముందు చంద్రబాబు మాట్లాడారు. మోడీ ప్రమాణ స్వీకారం కోసం దేశమంతా ఎదురుచూస్తోందన్నారు. ఈ విజయాన్ని అందరూ అభినందిస్తున్నారన్నారు.
అకుంఠిత దీక్షతో విజయంకోసం నిర్విరామంగా కృషి చేసిన మోడీకి అభినందనలను తెలియజేస్తున్నానని అన్నారు. మోడీతో కలసి తాను తిరుపతి శ్రీవారిని దర్శించుకున్నానని, అదే రోజున ఆయన ఆంధ్రప్రదేశ్లో ఐదు బహిరంగ సభల్లో పాల్గొన్నారని... మోడీ తీవ్రంగా శ్రమిస్తారనడానికి అదే ఉదాహరణ అన్నారు.