కేరళను తాకనున్న నైరుతీ రుతుపవనాలు... నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్
తిరువనంతపురం: నైరుతి రుతుపవనాలు మరో 24 గంటల్లో కేరళ తీరాన్ని తాకనుండటంతో కేరళ విపత్తు నిర్వహణ జూన్ 9 నుంచి 11వ తేదీ వరకు రెడ్, ఆరంజ్ అలర్ట్లను జారీ చేశారు. గతేడాది ఆగష్టులో భారీ వర్షాలు కురవడం వరదలు ఆ రాష్ట్రాన్ని ముంచెత్తడాన్ని దృష్టిలో ఉంచుకున్న అధికారులు మూడురోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణశాఖ అధికారుల హెచ్చరికలతో ముందస్తుగా అలర్ట్ జారీ చేశారు. గతేడాది వరదల్లో దాదాపు 350 మంది ప్రాణాలు కోల్పోయారు.
గతేడాది వచ్చిన వరదలు, తుఫానుతో కేరళ రాష్ట్రం అతలాకుతలం అయ్యింది. దీన్నుంచి ప్రభుత్వం పాఠాలు నేర్చుకుంది. దాదాపు 30 శాఖలను అలర్ట్ చేసింది కేరళ ప్రభుత్వం.ఇప్పటివరకు రెస్పాన్స్ సిస్టం కేవలం జిల్లా లెవెల్ వరకే ఉండేది. ఇప్పుడు తాలూకా వరకు వెళ్లింది. ఇక నైరుతీరుతు పవనాలు కేరళ తీరంను తాకే సమయంలో గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు అంచనా వేశారు.జూన్ 11వ తేదీవరకు చేపలవేటకు సముద్రంలోకి మత్స్యకారులు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేసింది. ఇక గతేడాది భారీ వర్షాలకు రాష్ట్రంలోని ప్రధాన 30 డ్యాములు గేట్లు ఎత్తివేయడంతో భారీ నష్టం కూడా వాటిల్లింది. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు అధికారులు.

ఇక ఇరిగేషన్ అధికారులు ఇస్తున్న సమాచారం ప్రకారం 16 సాగునీటి ప్రాజెక్టుల్లో 14 డ్యాముల వద్ద ఎమర్జెన్సీ యాక్షన్ ప్లాన్ను సెంట్రల్ వాటర్ కమిషన్కు అధికారులు సమర్పించారు. ఇందులో వాటర్ కమిషన్ 4 డ్యాములకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. మిగతా వాటికి రానున్న రోజుల్లో అనుమతి ఇస్తామని అధికారులు తెలిపారు. ఎమర్జెన్సీ యాక్షన్ ప్లాన్ ఏర్పాటు అయినప్పటికీ ముందుస్తు చర్యలు తీసుకోవడంలో యంత్రాంగం కాస్త వెనకపడి ఉందని అన్నారు డిజాస్టర్ మేనేజ్మెంట్ సెంటర్ మాజీ అధిపతి డాక్టర్ కేజీ తారా. విపత్తు వచ్చిన సమయంలో ప్రజలు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియదని ముందుగానే వారికి అవగాహన కల్పిస్తే బాగుంటుందని ఆమె అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications