సునంద పుష్కర్ మృతిపై కొడుకు, శశిథరూర్కు క్లీన్ చిట్
న్యూఢిల్లీ: తన తల్లి సునంద పుష్కర్ ఆత్మహత్య చేసుకోవాలని బలంగా నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోందని ఆమె తనయుడు శివ మీనన్ బుధవారం చెప్పారు. మీడియా ఒత్తిడి, టెన్షన్స్, మెడిసిన్స్ ఎక్కువగా తీసుకోవడం.. వంటి పలు ఒత్తిళ్లతో ఆమె అఘాయిత్యానికి పాల్పడ్డారని అభిప్రాయపడ్డారు.
ఆమె నిద్రలోనే మృతి చెందారని, ప్రశాంతంగా చనిపోయారని అన్నారు. తన తల్లి విషయంలో కేంద్రమంత్రి శశిథరూర్ పైన వస్తున్న ఆరోపణలను తాను విశ్వసించడం లేదని చెప్పారు. వారి మధ్య మంచి అనుబంధం ఉందన్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందామన్నారు.
కాగా, సునందా పుష్కర్ మరణానికి విష ప్రయోగం ప్రధాన కారణమన్న అంశాన్ని స్పష్టంగా ఎత్తి చూపించిన సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్, విష ప్రయోగం, ఆత్మహత్య, హత్య సహా అన్ని కోణాల్లో కూలంకషంగా కేసు దర్యాప్తు చేయాలని పోలీసులను మంగళవారం ఆదేశించిన విషయం తెలిసిందే.
సునంద మృతిలో ఎలాంటి కుట్ర ఉందని తాము భావించడం లేదని ఆమె కుటుంబ సభ్యులు స్పష్టం చేసినట్టు సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ అలోక్ శర్మ తన నివేదికలో పేర్కొన్నారు. సునంద మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన ఎయిమ్స్ వైద్యులు, ఆమె మరణం ఆకస్మికం, అసహజమైనదిగా పేర్కొనడమే కాక డ్రగ్స్ ఎక్కువ మోతాదులో తీసుకోవడం కారణంగా చనిపోయి ఉండొచ్చని పేర్కొన్నారు.
ఒకవిధంగా ఇది డ్రగ్ పాయిజనింగ్ కిందికి వస్తుంది. సునంద రెండు చేతుల పైన డజనుకు పైగా గాయాలున్నాయని, ఆమె ఎడం బుగ్గ పైన గీరుకుపోయిన గాయం ఉందని, బహుశా బలప్రయోగం కారణంగా ఇవి సంభవించి ఉండొచ్చని ఎస్డిఎంకు అందజేసిన పోస్టుమార్టం నివేదికలో పేర్కొన్నట్టు ఎయిమ్స్ వర్గాలు తెలిపాయి. అయితే మరణానికి ఈ గాయాలు కారణం కాదని ఆ నివేదికలో స్పష్టం చేశారు.
మరోవైపు సునంద కడుపులో ఆహారానికి సంబంధించిన శాంపిల్స్ ఏవీ కనిపించలేదని, బహుశా ఆమె అంతకుముందు ఎలాంటి ఆహారం తీసుకోకపోవడం అందుకు కారణం కావచ్చని నివేదికలో వైద్యులు పేర్కొన్నారు. సునంద చనిపోయి కనిపించిన హోటల్ గదిలో డిప్రెషన్ తగ్గించడానికి ఉపయోగించే అల్ప్రాక్స్గా పిలవబడే అల్ప్రాజోలమ్ టాబ్లెట్ల స్ట్రిప్లు కనిపించాయని పోలీసు వర్గాలు తెలిపాయి.