మోడీ భయంతో టి: జగన్, కెసిఆర్, దక్షిణాదిపై ఆశలు!
ఆగస్టు 11న హైదరాబాదులోని నిజాం కళాశాలలో మోడీ సభ జరిగింది. అప్పటి వరకు కాంగ్రెసు తెలంగాణపై ముందుకు వెళ్లలేదు. తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు సభ పెట్టి తెలంగాణ సాధిస్తామని మాత్రం చెప్పారు. అయితే మోడీ సభ నేపథ్యంలో జూలై 30న తెలంగాణకు సిడబ్ల్యూసి ఆమోదం తెలిపింది.
ఇప్పుడు సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఉత్తర భారతంలో మోడీ దూసుకు పోతున్నారు. దక్షిణాది వైపు అంత మోడీ మానియా అంతగా లేకపోయినప్పటికీ ఉత్తరాదిని మాత్రం బాగా ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెసు పార్టీ అధిష్టానం ప్రధానంగా వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం దక్షిణాది పైన ఎక్కువ దృష్టి సారించిందని అంటున్నారు.
అందులో భాగంగానే ఇప్పుడు కేబినెట్ తెలంగాణ నోట్కు ఆమోదం తెలిపిందంటున్నారు. దక్షిణాదిన ఎపి(విభజన జరిగితే తెలంగాణ, సీమాంధ్ర), కర్నాటకలలో అత్యధిక స్థానాలను గెలుచుకోవాలని భావిస్తోందంటున్నారు. తెలంగాణ ఇచ్చినందున ఇక్కడ పన్నెండు నుండి పదిహేను స్థానాలు, సీమాంధ్రలో జగన్తో పొత్తు, అలాగే కర్నాటకలోను అధిక స్థానాలు గెలవడం ద్వారా హస్తినను మరోసారి కైవసం చేసుకోవాలనుకుంటోందంటున్నారు. తెలంగాణ ఇవ్వడం ద్వారా తెరాసను కూడా మచ్చిక చేసుకోనున్నారు.
తాను నరేంద్ర మోడీతో వేదికను పంచుకున్న వెంటనే కాంగ్రెసు పార్టీ తెలంగాణ నోట్ను కేబినెట్ ముందుకు తీసుకు వచ్చిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. మోడీ భయంతో రెండు నెలల క్రితం సిడబ్ల్యూసి ఆమోదం, ఇప్పుడు కేబినెట్ నోట్ అని బిజెపి నేతలు విమర్శిస్తున్నారు.