ప్రశాంత్ కిషోర్ సంచలన నిర్ణయం : గాంధీ కుటుంబతో కలిసి ముందుకు : జగన్ ను ఒప్పిస్తారా..!!
జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా నిలుస్తున్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాజాగా, తమిళనాడు-పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో డీఎంకే-టీఎంసీ గెలుపులో కీలకంగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు టార్గెట్ 2024 గా పని చేస్తున్నారు. అందులో భాగంగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నాయకత్వంలో నాన్ కాంగ్రెస్ - నాన్ బీజేపీ నేతలను ఒకే వేదిక పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసారు. వారంతా ఇప్పడుు ఒక విధంగా పీకే మార్గదర్శకంలో పని చేస్తున్నారు.

గాంధీ కుటుంబంతో కీలక భేటీ..
ఇదే సమయంలో ప్రశాంత్ కిషోర్ అనూహ్యంగా గాంధీ కుటుంబంతో సమావేవమయ్యారు. సోనియాతో పాటుగా రాహుల్ , ప్రియాంకతో ఒకే సమయంలో సమావేశమయ్యారు. ఆ సమావేశంలో నేరుగా సోనియా నుండి కాంగ్రెస్ లోకి రావాల్సిందిగా ప్రశాంత్ కిషోర్ కు ఆహ్వానం అందింది. దీని పైన ఆయన ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోయినా..నో అని మాత్రం చెప్పలేదు. కాంగ్రెస్ లోకి వస్తే సరైన గుర్తింపు..హోదా ఇస్తామంటూ ప్రశాంత్ కిషోర్ కు ఆఫర్ ఇచ్చారు. 2024 సాధారణ ఎన్నికల గురించి ప్రశాంత్ కిశోర్.. గాంధీలతో చర్చించినట్లు భావించినా.. అంతకంటే పెద్దదే ఏదో జరగబోతున్నట్లు పార్టీ వర్గాలు చెప్పటం ద్వారా ఆయన కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారానికి మరింత బలం చేకూరింది.

బీజేపీ వ్యతిరేకులను ఏకం చేయటం..
2024 ఎన్నికల్లో బీజేపీ ని ఓడించటమే ప్రశాంత్ కిషోర్ లక్ష్యంగా మారింది. దీంతో..ఆయన ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. జాతీయ స్థాయిలో బీజేపీయేతర పార్టీల నేతలు అందరి నుండి ప్రశాంత్ కిషోర్ కు ఒక విధంగా యాక్సెప్టెన్సీ ఉంది. దీంతో పాటుగా రానున్న అయిదు రాష్ట్రాల ఎన్నికలు కాంగ్రెస్ కు కీలకం కానున్నాయి. గతంలో పంజాబ్ లో కాంగ్రెస్ ను గెలిపించి..కెప్టెన్ అమరీందర్ సింగ్ ఎన్నికల ప్రచారంలో వినూత్నం గా వ్యవహరించి ఆయన గెలుపుకు సహకరించారు. ఇప్పుడు మళ్లీ పంజాబ్..ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీని దెబ్బ తీస్తే, 2024 ఎన్నికల లక్ష్యంలో తొలి విజయం సాధించనట్లేనని కాంగ్రెస్ భావిస్తోంది. అందులో భాగంగా.. ఇప్పటి నుండే ఆయనకు బాధ్యతలు అప్పగిస్తోంది.

కాంగ్రెస్ నేతగా రంగంలోకి..
పశ్చిమ బెంగాల్ ఎన్నికల తరువాత తాను రాజకీయ వ్యూహకర్త గా పని చేయటం లేదని ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు. అయితే, గతంలో జేడీయూ లో పని చేసి ఉద్వాసనకు గురైన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు రాజకీయంగా ఒక లక్ష్యం..కసితో పని చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. అందులో భాగంగానే ఏ విధంగా అయినా బీజేపీ తిరిగి కేంద్రంలో అధికారంలోకి రాకుండా పని చేసేందుకు అన్ని అవకాశాలను..తన శక్తిని-సమర్దతను వినియోగిస్తున్నారు. ఇదే ఇప్పుడు గాంధీ కుటుంబాన్ని ఆకర్షించింది. వారి చర్చల్లో ప్రశాంత్ కిషోర్ చెప్పిన అంశాలు-వ్యూహాలతో పాటుగా కాంగ్రెస్ ఏ విధంగా ముందుకెళ్లాలో పీకే సూచించినట్లు తెలుస్తోంది. దీంతో..ఇక, ప్రశాంత్ కిషోర్ జాతీయ పార్టీని ఢీ కొనేందుకు మరో జాతీయ పార్టీలో చేరి ముందుకు సాగనున్నారు.
Recommended Video

జగన్ ను ఒప్పిస్తారా
బీజేపీని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ తో కలిసే ముందుకెళ్లాలని శరద్ పవార్ లాంటి వారు ఇప్పటికే స్పష్టం చేసారు. ఇక, ఏపీలో జగన్ గెలుపులో ప్రశాంత్ కిషోర్ పాత్ర తెలిసిందే. ఇప్పుడు పరోక్షంగా జగన్ కు ...అదే విధంగా, తన మాజీ టీం సభ్యులు షర్మిలకు రాజకీయంగా సహకారం అందిస్తున్నారు. దీంతో..ఇప్పుడు జగన్ ను సైతం తమ కూటమి వైపు తీసుకెళ్లేందుకు పీకే ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయి. కానీ, జగన్ తనను..తన కుటుంబాన్ని అవమానించి..ఇబ్బందులు పెట్టిన కాంగ్రెస్ తో మాత్రం కలిసే అవకాశాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండవని పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే, ప్రత్యేక హోదా కోసం కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా...తమ పార్టీ మద్దతు అవసరమైతే సహకరిస్తామంటూ జగన్ గతంలో చెప్పిన మాటలను గుర్తు చేస్తున్నారు. దీంతో...ఇప్పుడు పీకే రాజకీయ నిర్ణయం ..ఏపీతోనూ ముడిపడి ఉండే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications