మోడీ అలా అన్లేదు, మాకు చెప్పారు: గడ్కరీ, రామాలయం కడతామని తొగాడియా
న్యూఢిల్లీ: దేశాన్ని అవమానించేలా విదేశాల్లో ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని ప్రధాని నరేంద్ర మోడీ మంత్రులతో చెప్పారని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ గురువారం అన్నారు. మోడీ వ్యాఖ్యల పైన కాంగ్రెస్ పార్టీ అనవసర రాద్దాంతం చేస్తోందన్నారు. ఆయన ఎన్డీటీవీతో మాట్లాడారు.
అవినీతి పెరగడం, ఆర్థిక అవకాశాలు లేకపోవడంతో భారత దేశంలో పుట్టినందుకు ఒకప్పుడు తమ ప్రజలు బాధపడేవారని చైనా, కొరియా దేశాల్లో మోడీ చేసినట్లుగా వచ్చిన వార్తలు వివాదాస్పదమయ్యాయి. దీంతో మోడీ విదేశాల్లో భారత్ పరువు తీశారని విపక్షాలు మండిపడ్డాయి. ప్రధాని మోడీ వ్యాఖ్యలను వక్రీకరించారని గడ్కరీ అన్నారు. నాయకుల మాటలకు వక్రభాష్యం చెప్పవద్దన్నారు.
రామ మందిరం నిర్మిస్తాం: తొగాడియా
రామ మందిరాన్ని కచ్చితంగా నిర్మిస్తామని విశ్వహిందూ పరిషత్ నేత ప్రవీణ్ తొగాడియా పునరుద్ఘాటించారు. ఆలయ నిర్మాణం కోసం చర్చలు జరుగుతున్నాయన్నారు.
అందుకు ప్రధాని నరేంద్ర మోడీ చొరవ చూపాలని కోరారు. రాష్ట్రాల్లోని హిందూ దేవాలయాలు, ధార్మిక సంస్థల ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ప్రవీణ్ తొగాడియా అన్నారు. కాగా, రామ మందిరం నిర్మిస్తామని వీహెచ్పీ నేతలు గతంలోను వ్యాఖ్యానించారు.