మోడీ కోసం కలిశారు కానీ: రాహుల్కు నితీష్-కేజ్రీవాల్ ఎసరు?
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీకి భవిష్యత్తులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తదితరులతో పోటీ తప్పదా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. కాంగ్రెస్ పార్టీ అభిమానులు... రాహుల్ గాంధీని భావి ప్రధానిగా చూస్తుంటారు.
2014 ఎన్నికలకు ముందు వరకు దేశ రాజకీయాల్లో యూపీఏ, ఎన్డీయే, పాటు కాంగ్రెస్ - బిజెపి వ్యతిరేక కూటములుగా కనిపించేవి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎన్డీయే అద్భుత విజయం సాధించాక... బిజెపి, బిజెపి వ్యతిరేక కూటములే ప్రధానంగా కనిపిస్తున్నాయి.
ఇదే రాహుల్ గాంధీకి చిక్కులు తెచ్చేలా ఉందని అంటున్నారు. 2014 ఎన్నికల్లో యూపీఏ గెలిస్తే రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేవారు. కానీ ఎన్డీయే గెలిచింది. కాంగ్రెస్ తదుపరి లక్ష్యం 2019. అయితే, అప్పటికి నితీష్, కేజ్రీవాల్ తదితరులు రాహుల్ గాంధీకి పోటీ అయ్యే అవకాశాలు కొట్టిపారేయలేమని చెబుతున్నారు.

మొన్నటి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ కుమార్ నేతృత్వంలోని జెడీయూ, లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీలతో కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేసింది. నితీష్ కుమార్ కేబినెట్లో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు మంత్రులుగా కూడా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ కూటమి ఎన్నాళ్లు కొనసాగుతుందనే విషయం పక్కన పెడితే... మోడీ లేదా బిజెపికి వ్యతిరేకంగా కాంగ్రెస్, జెడియు, కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ, మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్.. ఇలా పలు పార్టీలు ఏకమవుతున్నాయి.
బీహార్ ఎన్నికల్లో మరోసారి గెలవడంతో నితీష్ కుమార్ పలుకుబడి మరింత పెరిగింది. భవిష్యత్తులో బిజెపికి గట్టి ప్రత్యర్థిని నితీష్ కుమార్గా చాలామంది భావిస్తున్నారు. జాతీయ రాజకీయాల్లో నితీష్ కుమార్ చక్రం తిప్పుతారని జేడీయు వర్గాలు కూడా చెబుతున్నాయి.
తద్వారా, 2019 ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా నితీష్ కుమార్ తెరపైకి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. 2014 ఎన్నికల్లోనే నితీష్ కుమార్ పేరు వినిపించింది. అప్పుడు ఆయన ఎన్డీయేలో ఉన్నారు. ప్రధాన మోడీ పేరును బిజెపి ప్రకటించడంతో నితీష్ ఎన్డీయే నుంచి బయటకు వచ్చారు.

నితీష్ కుమార్ దృష్టి కూడా ప్రధాని పదవి పైన ఉందని చెబుతున్నారు. మరోవైపు, అవినీతిరహిత రాజకీయాలు అంటూ పార్టీ పెట్టిన కేజ్రీవాల్ కూడా తన పార్టీని విస్తరిస్తున్నారు. ప్రస్తుతానికి బీహార్ ఎన్నికల్లో మహాకూటమికి ఓటేయాలని ఆయన చెప్పినప్పటికీ... ఆయన దేశ రాజకీయాల్లో చక్రం తిప్పే అవకాశాలున్నాయి.
ఇలా, కాంగ్రెస్ వైపు ఉన్న పార్టీల నేతలు నితీష్ కుమార్, కేజ్రీవాల్ వంటి వారు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి నేతలు బిజెపితో పాటు సొంత కూటమిలోని రాహుల్ గాంధీకి కూడా ప్రధాని పదవి రేసులో పోటీ అవుతారని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications