అన్నా వర్సిటీలో అందాల ప్రదర్శన: నిషేధించాలంటూ మద్రాస్ హైకోర్టు సీరియస్
చెన్నై: తమిళనాడులోని విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్ధలు, డీమ్డ్ యూనివర్సిటీలు, కాలేజీల్లో అందాల ప్రదర్శన (ఫ్యాషన్ షో)లను నిషేధించాలని మద్రాస్ హైకోర్టు రాష్ట్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు అన్ని విద్యాసంస్ధలకు వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వానికి, ఉన్నత విద్యాశాఖకు తెలిపింది.
అన్నా వర్సిటీలోని సెంట్రల్ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన స్టూడెంట్స్ అసోసియేషన్, ఆర్ట్స్ సొసైటీ కలిసి "మిస్ టెక్నోఫెస్ట్ - 2013" పేరిట అందాల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా తమ కుమార్తె అక్షయ పట్ల పోటీల నిర్వహకులు అమర్యాదగా ప్రవర్తించారని, ఆమెకు రావాల్సిన బహుమతి రాకుండా నకిలీ ధృవపత్రాల్నీ ఇచ్చారని ఆరోపిస్తూ లక్ష్మీ సురేష్ అనే మహిళ హైకోర్టును ఆశ్రయించింది.

ఇందుకు గాను రూ. 5 లక్షల నష్టపరిహారం చెల్లించాల్సిందిగా కోరారు. ఆ పిటిషన్ను విచారించిన జస్టిస్ టీఎస్ శివజ్ఞానం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. "ఇలాంటి ప్రదర్శనలు అవసరమా? విద్యార్ధికి తాను సాధించే ఇంజనీరింగ్ డిగ్రీకి ఈ ప్రదర్శన ఏ మాత్రం దోహదపడుతుంది" అంటూ అన్నావర్సిటీ అధికారులను ప్రశ్నించారు.
విద్యార్ధుల అందాలకు ప్రాముఖ్యతను ఇచ్చే 'మిస్టర్', 'మిస్', 'ఫ్యాషన్ షో' లాంటి వాటిని నిషేధించాలని ఆదేశించారు. ఇక పరిహారం విషయానికి వస్తే అన్నా యూనివర్సిటీ అధికారులు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసిన తర్వాతనే నిర్ణయించడానికి సాధ్యం అవుతుందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications