కోర్టును దిక్కరించిన మంత్రి: నాన్ బెయిలబుల్ వారెంట్లు
లక్నో: నేను మంత్రిని తనను ఎవరు ఏమి చేస్తారులే అని నిర్లక్ష్యం చేసిన మంత్రికి కోర్టు నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. మంత్రిగారితో పాటు 32 మందికి నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి. ఉత్తరప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి యాసీర్ షాకు ఈ వారెంట్లు జారీ అయ్యాయి.
పోలీసు అధికారుల కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 2007 సంవత్సరం లో ఒక వ్యక్తి భారీగా మత్తు మందులు సేకరించి పెట్టుకున్నాడని యాసీర్ షా తెలుసుకున్నారు. తరువాత అతనిని యాసీర్ షా గృహ నిర్బంధం చేశారని ఆరోపణలు ఉన్నాయి.
మంత్రితో పాటు పోలీసు అధికారుల మీద ఆరోపణలు వచ్చాయి. నాన్పరా పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుండి కేసు విచారణ జరుగుతున్నది. అయితే మంత్రి యాసీర్ షాతో పాటు ఆరోపణలు ఎదుర్కోంటున్న వారు కేసు విచారణకు సక్రమంగా హాజరు కాలేదు.
కేసు విచారణ కుంటుపడుతున్న దృష్ట్యా న్యాయస్థానం వీరికి సమన్లు జారీ చేసింది. అయినా వీరు లెక్క చెయ్యలేదు. సమన్లును సైతం ధిక్కరించిన మంత్రిపై శుక్రవారం చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ బర్ బాంకీ సర్వజీత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మే 12వ తేదికి కేసు విచారణ వాయిదా వేశారు. మంత్రిని కోర్టు ముందు హాజరు పరచాలని నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేశారు. మే 12వ తేది లోపు మంత్రిని కోర్టు ముందు హాజరు పరుస్తామని లక్నో ఎస్పీ బరాచి ఆర్.ఎల్. వర్మా తెలిపారు.