ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్పై సీరం క్లారిటీ - భారత్లో ట్రయల్స్ ఆగవు - అసలు కారణం ఇదే
కరోనా మహమ్మారిని అంతం చేసే వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందాని యావత్ మానవాళి ఎదురుచూస్తున్న వేళ.. వ్యాక్సిన్ ప్రయోగాల్లో ఫ్రంట్ రన్నర్ గా పేరుపొందిన ఆక్స్ ఫర్డ్ ఆస్ట్రాజెనికా 'కొవిషీల్డ్' వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ నిలిచిపోవడం అందరినీ షాక్ కు గురిచేసింది. యునైటెడ్ కింగ్ డమ్(యూకే)కు చెందిన ఓ వాలంటీర్ కు సైడ్ ఎఫెక్ట్స్ కనిపించడంతో క్లినికల్ ట్రయల్స్ ను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు ఆస్ట్రాజెనికా సంస్థ బుధవారం ప్రకటించింది. అయితే, ట్రయిల్స్ నిలుపుదల కేవలం యూకేకు మాత్రమే వర్తిస్తుందని, భారత్ లో 'కొవిషీల్డ్' ప్రయోగాలు యధావిధిగా కొనసాగుతాయని సీరం సంస్థ సీఈవో అధర్ పునావాలా స్పష్టం చేశారు.

అనుమానాల నివృత్తి..
స్విడిష్-బ్రిటిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా.. ప్రఖ్యాత ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి ‘కొవిషీల్డ్' పేరుతో వివిధ దేశాల్లో కొవిడ్ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేస్తుండటం, దానికి ఇండియాలో ప్రఖ్యాత సీరం సంస్థ భాగస్వామిగా కొనసాగుతుండటం తెలిసిందే. ట్రయల్స్ కీలక దశకు చేరిన వేళ.. యూకేలో అర్ధాంతరంగా ప్రయోగాలను నిలిపేయడంతో ఆ ప్రభావం మిగతా దేశాలపైనా, మరీ ముఖ్యంగా భారత్ లో సీరం ఆధ్వర్యంలో కొనసాగుతోన్న ట్రయల్స్ పైనా ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో సీరం సీఈవో అధర్ పునావాలా బుధవారం మీడియా ముందుకొచ్చి పలు అంశాలపై క్లారిటీ ఇచ్చారు.

భారత్లో లోపాలు లేవు..
‘కొవిషీల్డ్' వ్యాక్సిన్ కు సంబంధించి భారత్ లో ఇప్పటి దాకా ఎలాంటి లోపాలు, ప్రతికూల పరిస్థితులు తలెత్తలేదని సీరం సీఈవో స్పష్టం చేశారు. ‘‘ప్రయోగాల్లో పాల్గొంటోన్న వాలంటీర్లలో యూకేకు చెందిన ఒక వ్యక్తికి మాత్రమే సైడ్ ఎఫెక్ట్స్ కనిపించాయి. ఆ ఎఫెక్ట్ మా కొవిడ్ వ్యాక్సిన్ డోసు వల్ల ఉత్పన్నమైంది కాదు. అతనికి ఇదివరకే న్యూరో సంబంధిత ఇబ్బందులున్నాయి. ఎఫెక్ట్స్ గుర్తించిన వెంటనే అక్కడి వాళ్లు ట్రయల్స్ ఆపేశారు. వ్యాక్సిన్ ప్రయోగాల్లో ఇది సహజంగా జరిగేదే. అయితే, ఇండియాలో ట్రయల్స్ నిలిచిపోవు. ముందుగా ప్రకటించిన టైమ్ లైన్ ప్రకారమే ప్రయోగాలు కొనసాగుతాయి. '' అని పునావాలా వివరించారు. భారత్ లో మొత్తం 17 చోట్ల సీరం ఆధ్వర్యంలో క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఒక్కో సెంటర్లో 1000 మందికిపైగా వాలంటీర్లు ప్రయోగాల్లో పాలుపంచుకుంటున్నారు.

డీఎస్ఎంబీ ఏం చేయబోతోంది?
ఆక్స్ ఫర్డ్ ఆస్ట్రాజెనికా ‘కొవిషీల్డ్' వ్యాక్సిన్ కు సంబంధించి ఇండియాలో ఎలాంటి లోపాలు లేవని సీరం సంస్థ స్పష్టం చేసినప్పటికీ.. దీనిపై డేటా అండ్ సేఫ్టీ మానిటరింగ్ బోర్డ్(డీఎస్ఎంబీ) సైతం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. మన దేశంలో వ్యాక్సిన్ల ప్రమాణాలను పరిశీలించే అత్యున్నత సంస్థ డీఎస్ఎంబీ అని తెలిసిందే. ‘‘యూకేలో ట్రయల్స్ నిలిపేసిన నేపథ్యంలో ఇండియాలోని ట్రయల్స్ పై డీఎస్ఎంబీ ఎలాంటి సిఫార్సు చేస్తుందనే దానిపైనే తదుపరి ప్రయోగాలు ఉండొచ్చు. తమకు లభించే డేటాను సమీక్షించిన తర్వాత ఆ సంస్థ ఓ నిర్ణయానికి వస్తుంది. నాకు తెలిసినంత వరకు ఇండియాలో కొవిషీల్డ్ పరిశోధన, క్లినికల్ ట్రయల్స్ నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయి. అయితే, చిక్కులు ఎదురయ్యే అవకాశాలను కొట్టిపారేయలేం'' అని ప్రముఖ రీసెర్చర్ అనంత భాన్ అభిప్రాయపడ్డారు.

ట్రయల్స్లో ఇవి సహజమే..
ఆక్స్ ఫర్డ్ ఆస్ట్రాజెనికా కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రస్తుతం ఫేజ్ 3 దశకు చేరాయి. ట్రయల్స్ కీలక దశలో ఇలాంటి పరిణామాలు సహజంగా జరిగేవేనని, ప్రయోగాల గురించి మీడియాలో భిన్న కథనాలు రావడం కూడా పరిపాటే అని సైంటిఫిక్ కమ్యూనిటీలో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీ ఎయిమ్స్ కు చెందిన వ్యాక్సిన్ నిపుణులు సైతం దీనిపై స్పందించారు. ‘‘వ్యాక్సిన్ డోసు ఇచ్చిన తర్వాత రోగి అనారోగ్యానికి గురికావడం లేదా మరణించడం గతంలోనూ ఉన్నాయి. అలాంటి సందర్భాల్లో ట్రయల్స్ న నిలిపేయాల్సి ఉంటుంది. ఆక్స్ ఫర్డ్ ఆస్ట్రాజెనికా ఇప్పుడు అదే పని చేసింది కాబట్టి వాళ్లు నైతిక విధానాలను అనుసరిస్తున్నారని నిరూపణ అయింది'' అని ఎయిమ్స్ వ్యాక్సిన్ నిపుణుడొకరు అన్నారు.












Click it and Unblock the Notifications