ఆక్సిజన్ .. ఆక్సిజన్.. అల్లాడిపోతున్న జనం ..ఢిల్లీ నుండి గల్లీ దాకా పరిస్థితి ఇదే !!
భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. విపరీతంగా పెరుగుతున్న కేసులతో భారత్ పరిస్థితి రోజు రోజుకీ దిగజారి పోతోంది. ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఆక్సిజన్ కోసం అల్లాడుతున్న కరోనా రోగుల ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి . ప్రాణవాయువు కోసం ప్రజలు విలవిల్లాడుతున్నారు.
మెజార్టీ రాష్ట్రాలలో ఆక్సిజన్ కొరత .. ఆక్సిజన్ లేక ప్రజల ప్రాణాలు గాలిలో
దేశంలో మెజార్టీ రాష్ట్రాలలో ఆక్సిజన్ కొరత నెలకొంది . మహారాష్ట్ర , ఢిల్లీ, హర్యానా, చత్తీస్గడ్ ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇలా అనేక రాష్ట్రాలలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా నెలకొంది.
దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత కారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి తగినంత ఆక్సిజన్ సరఫరా చేయాలని, ప్రాణవాయువును అందించి ప్రజల ప్రాణాలను కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. ఆక్సిజన్ అందక చాలాచోట్ల కరోనా బాధితులు మృత్యు ఒడికి చేరుకుంటున్నారు. ఢిల్లీలో ఆక్సిజన్ అందక మరణించిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది.
ఆక్సిజన్ లేక రోగులను వెనక్కి పంపేస్తున్న ఆస్పత్రులు , దిక్కుతోచని స్థితిలో రోగులు
ఇక్కడ అక్కడ అని లేకుండా ఆక్సిజన్ సిలిండర్ల కొరతతో చాలాచోట్ల ఆసుపత్రులకు వచ్చిన పేషెంట్లను వెనక్కి తిప్పి పంపేస్తున్నారు. తీవ్రమైన శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడుతున్న పేషెంట్లు ఆక్సిజన్ కోసం అల్లాడుతున్నారు. దిక్కుతోచని స్థితిలో కంటికి కడివెడు శోకిస్తున్నారు .
రాష్ట్ర ప్రభుత్వాలు వైద్య సదుపాయాల కొరత లేదని చెబుతున్నా ప్రతి రాష్ట్రంలోనూ వైద్య సదుపాయాల కొరత స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీ ఇంత అని చెప్పడానికి వీలు లేకుండా ఉంది.
ఆక్సిజన్ అందక సంభవిస్తున్న మరణాలే ఎక్కువ
ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తూ, లక్షలకు లక్షలు బిల్లులు వేస్తూ కూడా రోగులకు కావలసిన సదుపాయాలను అందించడంలో ప్రైవేట్ ఆసుపత్రులు సైతం ఫెయిల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది . ప్రభుత్వ ఆసుపత్రులలో ఇప్పటికే వైద్య సదుపాయాల లేమి , ముఖ్యంగా ఆక్సిజన్ నిల్వలు నిండుకుంటున్న పరిస్థితి ప్రజలకు , ఇటు ప్రభుత్వాలకు ఆందోళన కలిగిస్తుంది .
ప్రతి రాష్ట్రంలోనూ వందల సంఖ్యలో కరోనా బాధితులు మృత్యువాత పడుతున్నారు. కరోనా బాధితుల దహనాలు , ఖననాలతో స్మశానాలలో పరిస్థితి అత్యంత దారుణంగా తయారయింది .
ఆక్సిజన్ కొరతపై కేంద్రానికి కోర్టు చీవాట్లు
కేంద్ర ప్రభుత్వం ఆక్సిజన్ సరఫరాపై దృష్టి సారించి కరోనా బాధితుల అవసరాలకు ఆక్సిజన్ అందించాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ దేశంలోని కరోనా రోగుల అవసరాలకు తగ్గట్టుగా ఆక్సిజన్ అందే పరిస్థితి కనిపించడం లేదు . అనేకమార్లు ఆక్సిజన్ కొరత కారణంగా కరోనా పేషెంట్ల మరణాలు పెరుగుతున్నాయని, కేంద్ర ప్రభుత్వానికి ఢిల్లీ హైకోర్టు అనేకమార్లు చివాట్లు పెట్టింది. ప్రాణాలు పోతుంటే పట్టింపు లేదా అని మండిపడింది.
ప్రాణ వాయువు కోసం పరితపిస్తున్న జనం .. హృదయ విదారకం
పారిశ్రామిక అవసరాలకు ఆక్సిజన్ నిలిపివేసి, ప్రజల ప్రాణాలను కాపాడాలని ఆదేశించింది. కేంద్రం సైతం అదే ప్రయత్నంలో ఉన్నామని పదే పదే చెబుతున్నప్పటికీ పరిస్థితులలో మాత్రం మార్పు లేదు . ఆక్సిజన్ కోసం ప్రజలు నానా అగచాట్లు పడుతున్నారు. ఆక్సిజన్ అందకనే ఎక్కువశాతం కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. ప్రాణవాయువు కోసం ప్రజలు పరితపిస్తున్న తీరు ప్రతి ఒక్కరిని తీవ్ర ఆవేదనకు గురి చేస్తోంది. ఆసుపత్రులలో పరిస్థితులు హృదయ విదారకంగా తయారయ్యాయి.