భూకంపం: హాస్టల్ భవనంపై నుంచి దూకిన యువతి
శ్రీనగర్: ఉత్తరభారతాన్ని కుదిపేసిన భూకంపం ఓ యువతి ప్రాణం మీదకు తెచ్చింది. కాశ్మీర్లోని ఒక్కసారిగా భూమి కంపించడంతో ఓ కాలేజీ విద్యార్థినులు తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు. ఈ ఒత్తిడిని తట్టుకోలేని ఓ అమ్మాయి కాలేజీ హాస్టల్ మొదటి అంతస్తు నుంచి దూకేసింది.
ప్రాణాపాయం లేకపోయినా, తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఎంఎ రోడ్ ఉమెన్స్ కాలేజీలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. కాలేజీ అమ్మాయిలంతా వైవా టెస్టుకు ప్రిపేర్ అవుతున్నారు. అంతా కోలాహలంగా ఉంది. ఇంతలో ఆకస్మాత్తుగా భూమి కంపించడాన్ని గమనించిన విద్యార్థినులు భయాందోళనకు గురై బయటికి పరుగులు తీశారు.
బిఏ మొదటి సంవత్సరం చదువుతున్న మరో అమ్మాయి మాత్రం ఈ గందరగోళంలో హాస్టల్ భవనం నుంచి దూకేసింది. ఈ వార్తను సదరు కాలేజీ ప్రిన్సిపల్ ధృవీకరించారు. బాధితురాలిది ఉత్తర కాశ్మీర్ కుప్వారా జిల్లా అని చెప్పారు. ఘటనకుసంబంధించి ఆమె బంధువులకు ఇప్పటికే సమాచారం అందించామని తెలిపారు.
కాగా, భూకంపం వార్తలతో తల్లిదండ్రులందరూ తమ పిల్లలు చదువుకుంటున్న స్కూళ్లకు పరుగులు పెట్టారు. తాను స్కూలుకెళ్లేసరికి పిల్లలు, టీచర్లు అంతా షాక్లో ఉన్నారని, అక్కడి పరిస్థితి అంతా గందరగోళంగా, అయోమయంగా ఉందని జావేద్ అహ్మద్ అనే పేరెంట్ తన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు.