సీనియర్ వేధింపులు: బిఎస్సీ విద్యార్థిని ఆత్మహత్య
చెన్నై: తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో దారుణం చోటు చేసుకుంది. సీనియర్ల వేధింపులు భరించలేక ఓ బిఎస్సీ (ఎమర్జెన్సీ అండ్ ట్రామా కేర్) విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. చెన్నై రామచంద్ర మెడికల్ యూనివర్సిటీలో చదువుతున్న ఆ విద్యార్థిని.. తన హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
బిఎస్సీ రెండో సంవత్సరం చదువుతున్న తనను ఓ సీనియర్ విద్యార్థిని విపరీతంగా వేధించిందంటూ ఆమె పేరును సూసైడ్ నోట్లో రాసింది. ఆమె మృతికి కారణంగా పేర్కొన్ని సీనియర్ విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు.

కాగా, తమ విచారణలో ఇది ర్యాగింగ్ కాదని తేలిందని, సాధారణంగా జూనియర్లు, ఫ్రెషర్లను మాత్రమే ర్యాగింగ్ చేస్తారని యూనివర్సిటీ ప్రతినిధి నల్లముత్తు తెలిపారు. అయితే బాధిత యువతి ఇప్పటికే రెండో సంవత్సరం చదువుతోందని ఆయన చెప్పారు. ఘటనకు ముందు ఎలాంటి ర్యాగింగ్ ఫిర్యాదు తన వద్దకు రాలేదని చెప్పారు.
సీనియర్ కూడా ఆమె గదికి దగ్గర్లోనే ఉంటోందని, వీరిద్దరి మధ్య ఏదో సమస్య ఉండి ఉంటుందని ఆయన చెప్పారు. అయితే బాధితురాలి తల్లిదండ్రులు మాత్రం ఇది ఖచ్చితంగా ర్యాగింగేనని చెబుతున్నారు. బాధితురాలు, సీనియర్ విద్యార్థి మధ్య నెలకొన్న వ్యక్తిగత శత్రుత్వమే ఆత్మహత్యకు కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు విచారణలో జాగ్రత్తలు తీసుకుంటున్నామని పోలీసులు చెప్పారు.












Click it and Unblock the Notifications