ఆల్టైమ్ హై! రూ.88.67: పెట్రో ధరలు ఏ సిటీలో ఎంతంటే?
న్యూఢిల్లీ: ఇంధన ధరలు శుక్రవారం కూడా స్వల్పంగా పెరుగుదలను నమోదు చేశాయి. రోజువారీ సవరణల్లో భాగంగా శుక్రవారం కూడా పెట్రో ధరలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో గురువారం రూ. 81ని తాకిన పెట్రోల్ ధర.. శుక్రవారం మరో 28పైసలు పెరిగింది. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 81.28గా ఉంది.
ఇక ధరలు అత్యధికంగా ఉండే భారత ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ ధర రూ. 90కి మరింత చేరువైంది. శుక్రవారం అక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ. 88.67గా ఉంది. చెన్నైలో రూ. 84.49, కోల్కతాలో రూ. 83.14, హైదరాబాద్లో రూ. 86.18గా ఉంది.
మరోవైపు డీజిల్ ధర కూడా నేడు పెరిగింది. ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర 22 పైసలు పెరిగి రూ.73.30గా ఉంది. ముంబైలో రూ. 77.82, కోల్కతాలో రూ. 75.15, చెన్నైలో రూ. 77.49, హైదరాబాద్లో రూ. 79.73గా ఉంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 85.27 కాగా, డీజిల్ ధర 78.48గా ఉంది. ఇక విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 84.63, డీజిల్ 77.79గా ఉంది.
స్వల్పంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు: ముంబైలో అత్యధికం
ముడిచమురు ధరలు పెరగడంతో పాటు ఎక్సైజ్ సుంకం ఎక్కువగా ఉండటంతో దేశీయంగా చమురు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఆగస్టు మధ్య నుంచి ఇప్పటి వరకు లీటర్ పెట్రోల్పై రూ. 4.48, డీజిల్పై రూ. 4.77 పెరిగింది. కాగా, ఈ వారంతంలో ప్రధాని మోడీ పెట్రో ధరల పెరుగుదల, రూపాయి పతనంపై సమీక్షించనున్నారు.